
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ కోల్గేట్-పామోలివ్ తన ఉత్పత్తుల ధరలను పెంచే యోచనలో ఉంది. రానున్న త్రైమాసికాల్లో ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముడిసరుకుల వ్యయం పెరగడమే ఇందుకు కారణం. కంపెనీ లాభాల మార్జిన్లను కాపాడుకొనేందుకు ఈ ధరల పెంపు అనివార్యమైందని కంపెనీ పేర్కొన్నట్లుగా పలు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. ‘‘గతేడాది జీఎస్టీ సవరణ వల్ల ఉత్పత్తుల బరువును పెంచాం. ప్రస్తుతం రూ.10, రూ.20 నుంచే కోల్గేట్ ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో ముడి సరుకుల సరఫరాపై ప్రభావం పడుతోంది. ఇప్పుడు ధరలు పెంచకపోతే భవిష్యత్తులో ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని కంపెనీ సీఈవో అండ్ ఎండీ ప్రభా నరసింహన్ తెలిపారు. అలాగే, కంపెనీ టూత్ బ్రష్, టూత్ పేస్ట్ రెండింటిలోనూ ప్రీమియం ఉత్పత్తులను తయారు చేయడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మరోవైపు, కోల్గేట్-పామోలివ్కు చెందిన పర్సనల్ కేర్ బ్రాండ్ పామోలివ్ మార్కెట్ పనితీరుపై ప్రభా నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీ ఉత్పత్తుల మార్కెట్ను మరింత బలోపేతం చేసుకునేందుకు బాంబే షేవింగ్ కంపెనీతో జట్టు కట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీ పతాంజలి, హేలియోన్ కంపెనీకి చెందిన సెన్సోడైన్, హిందూస్థాన్ యునిలీవర్కు చెందిన పెప్సోడెంట్ ఉత్పత్తులతో పోటీపడుతోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు