
Fuel Prices Hike| ఇంటర్నెట్డెస్క్: పశ్చిమాసియా ఘర్షణలు ఎప్పుడు ముగుస్తాయో తెలియని అనిశ్చితి నెలకొంది. దాంతో ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో అంతరాయాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి సీఎన్జీ (CNG) ధరలు పెరిగాయి. విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలో కూడా వరుసగా రెండోనెలలో పెంపు నమోదైంది. మంగళవారం మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) సీఎన్జీ ధరను కేజీకి రూ.2 చొప్పున పెంచింది. దీంతో ముంబయి, పరిసర ప్రాంతాల్లో కేజీ గ్యాస్ ధర రూ.88కి ఎగబాకింది. డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ (SCM)కు ఒక రూపాయి చొప్పున పెరిగింది. ఈ ధరలు నేటినుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయ విపణిలో ధరలకు అనుగుణంగా ఈ ఇంధనాల రేట్లను సవరించినట్లు ఎంజీఎల్ వెల్లడించింది. రెండురోజుల క్రితం ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కూడా సీఎన్జీ ధరలు పెంచిన సంగతి తెలిసిందే. దాంతో దిల్లీ పరిసర ప్రాంతాల్లో ఆ గ్యాస్ ధర రూ.83.09 నుంచి రూ.86.98కి చేరింది. సీఎన్జీ ధరలు పెరగడంతో ఆటో, ట్యాక్సీ సంఘాలు ప్రయాణ ఛార్జీల పెంపునకు డిమాండ్ చేస్తున్నాయి. దేశీయ విమానాలకు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధర లీటర్కు రూ.6.28 (5.46 శాతం) మేర పెరిగింది. దీంతో లీటర్ ధర రూ.115 నుంచి రూ.121.28కి పెరిగింది. ఈ మేరకు ఇండియన్ ఆయిలో కార్పొరేషన్ లిమిటెడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ పెంపు దేశీయ విమానయాన సంస్థలకు భారంగా మారనుంది. దాంతో ఆ ప్రభావం ప్రయాణికులపై పడనుంది. ఆగస్టు ఒకటిన ఏటీఎఫ్ లీటర్ ధర రూ.110 నుంచి 115కు పెరిగిన సంగతి తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల