
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో జల భద్రతకు కొత్త పాలసీని అమలులోకి తీసుకు వచ్చింది. భవిష్యత్తు తరాలకు నీటి కొరత లేకుండా ఈ విధానాన్ని తీసుకువచ్చింది.
స్వర్ణాంధ్ర విజన్-2047 పది సూత్రాల ప్రణాళికలో భాగంగా జల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగ పాలసీకి ఆమోదం ముద్ర వేసింది. సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహిస్తూ, పర్యావరణ కాలుష్యాన్ని అదుపు చేయడంలో ఈ నిర్ణయం మైలురాయిగా నిలవనుంది.
ఈ నూతన విధానం ద్వారా రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల ( యూఎల్ బీ) పరిధిలో ఉత్పత్తి అయ్యే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేసి, దానిని తిరిగి ఉత్పాదక రంగాల్లో వినియోగించడమే లక్ష్యంగా మార్గదర్శకాలను జారీ చేసింది. సాధారణంగా నదుల్లోకి, సముద్రాల్లోకి వదిలేసే వ్యర్థ జలాలను రీసైక్లింగ్ చేసి, వాటిని వివిధ అవసరాలకు మళ్లించనున్నారు. పారిశ్రామిక, పౌర వ్యర్థ జలాల పునర్వినియోగం వల్ల సహజ నీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే.. భూగర్భ జలాలు అడుగంటిపోకుండా కాపాడుకోవడానికి దోహదపడుతుంది.
ఈ విధానం కింద శుద్ధి చేసిన నీటిని ప్రధానంగా పెద్ద ఎత్తున నిర్మాణ రంగ పనులకు, ల్యాండ్స్కేపింగ్, పురపాలక సేవలు, పబ్లిక్ పార్కులు, తోటల పెంపకానికి ఉపయోగించనున్నారు. అలాగే నగరాల్లో రోడ్లను శుభ్రం చేయడానికి, అగ్నిమాపక సేవల అవసరాలకు, రైల్వే యార్డులు, అలాగే బస్ డిపోలలో వాహనాల క్లీనింగ్ కోసం ఈ శుద్ధి చేసిన నీటిని మాత్రమే వాడేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటు ఓడరేవులు, భారీ వాణిజ్య సంస్థలు..ఇలా ఎక్కడైతే అనువుగా ఉంటుందో అక్కడ ఈ జలాలను వినియోగంలోకి తీసుకురానున్నారు. వాషింగ్ సౌకర్యాలు ఎక్కువగా ఉండే వాణిజ్య యూనిట్లకు కూడా ఈ నీటిని సరఫరా చేస్తారు.
ఈ ప్రణాళికను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం కచ్చితమైన నిబంధనలను విధించింది. శుద్ధి కేంద్రాల నుండి 5 కిలోమీటర్ల పరిధిలో జరిగే అన్ని రకాల నిర్మాణ కార్యక్రమాలు, అలాగే 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రైల్వే యార్డులు, బస్ డిపోలు, పోర్టులు వంటి భారీ వినియోగదారుల పరిధిలోకి ఈ నీటి సరఫరాను వర్తింపజేశారు. ఈ నిర్దేశిత పరిధిలో ఉన్న పరిశ్రమలు, సంస్థలు కచ్చితంగా శుద్ధి చేసిన మురుగునీటినే వాడాల్సి ఉంటుంది. దీనివల్ల తాగు నీటిని పారిశ్రామిక అవసరాలకు మళ్లించే పరిస్థితి ఉండదు.
పట్టణాల్లో మౌలిక సదుపాయాల ఆధునీకరణలో భాగంగా డ్యూయల్ పైపింగ్ వ్యవస్థ ను ప్రభుత్వం ఐచ్ఛికం నుంచి తప్పనిసరి చేయనుంది. నోటిఫైడ్ ప్రాంతాలలో నిర్మించే గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలు, సంస్థాగత భవనాలలో ప్రణాళికాబద్ధంగా ఈ డ్యూయల్ పైపింగ్ లైన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక పైపు ద్వారా స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అయితే, రెండవ పైపు లైన్ ద్వారా ఫ్లషింగ్, గార్డెనింగ్ వంటి ఇతర అవసరాల కోసం శుద్ధి చేసిన మురుగునీరు అందుతుంది. ఈ వినూత్న జల నిర్వహణ విధానం ఆంధ్రప్రదేశ్ను జల సమృద్ధి గల రాష్ట్రంగా మార్చడమే కాకుండా, రాబోయే తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇంటెలిజెన్స్ బ్యూరో కొత్త చీఫ్గా మహేశ్ దీక్షిత్!
ఏపీ ప్రాథమిక విద్యకు ప్రపంచ బ్యాంకు ప్రశంసలు
.