
13 Year Old AI App Developer Zhu Shuhan : సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలంటే విపరీతమైన కోడింగ్ నైపుణ్యాలు ఉండాల్సిన అవసరం లేదని, మంచి ఆలోచన ఉంటే కృత్రిమ మేధ (ఏఐ)తో అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించింది ఓ 13 ఏళ్ల పాఠశాల విద్యార్థిని. చైనాకు చెందిన ఝూ షుహాన్ అనే 13 ఏళ్ల చిన్నారి ఒక్క లైన్ కోడింగ్ కూడా రాయకుండానే ఒక వినూత్నమైన ఏఐ స్టడీ అసిస్టెంట్ యాప్ను తయారుచేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. తన ఆలోచనతో తయారుచేసిన ఈ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 18,000 యువాన్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.2.5 లక్షలకు పైగా) అర్జించి సంచలనం సృష్టించింది.'వర్చువల్ పేరెంట్' యాప్ వెనుక అసలు కథ ఇదే..!ఝూ షుహాన్ రూపొందించిన ఈ డిజిటల్ అప్లికేషన్కు 'జై చాంగ్' అని నామకరణం చేసింది. ఇంగ్లీష్లోకి దాన్ని అనువదిస్తే 'ఆన్ సైట్' అంటే అందుబాటులో ఉండటం అని అర్థం వస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకునే సమయంలో వారిపై నిఘా ఉంచడాన్ని, పర్యవేక్షించడాన్ని సులభతరం చేసేందుకు ఈ యాప్ ఎంతో తోడ్పడుతుంది. పిల్లలు తమ ఫోటోను అప్లోడ్ చేసిన వెంటనే.. ఈ యాప్ ఒక 'వర్చువల్ పేరెంట్' లేదా 'డిజిటల్ పేరెంట్ క్లోన్' రూపంలో మారి బాధ్యతలు స్వీకరిస్తుంది.విద్యార్థి తన చదువును పక్కన పెట్టి మొబైల్ ఫోన్తో ఆడుకుంటున్నా లేదా తను కేటాయించిన స్థానాన్ని వదిలి పక్కకు వెళ్లినా.. కెమెరా సాంకేతికత ద్వారా పసిగట్టి తక్షణమే తల్లిదండ్రులకు హెచ్చరిక సందేశాలను పంపుతుంది. "నా తల్లిదండ్రులు నిరంతరం ఉద్యోగ వ్యాపారాల్లో బిజీగా ఉండటం వల్ల నేను చదువుకునే సమయంలో నా పక్కన ఉండేందుకు సమయం దొరికేది కాదు. దాంతో హోమ్వర్క్ చేసే సమయంలో దారితప్పి రహస్యంగా ఫోన్ వాడేదాన్ని. నా తోటి విద్యార్థుల్లో చాలామంది స్వయం క్రమశిక్షణ లేక ఇదే విధమైన సమస్య ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ యాప్ ఆలోచన వచ్చింది" అని షుహాన్ వివరించింది.సహజమైన ఫీచర్లు.. జాతీయ స్థాయిలో మూడో బహుమతిఈ యాప్ కేవలం నిఘా పెట్టడమే కాకుండా చదువుకోవడానికి అవసరమైన టైమ్టేబుల్స్ తయారు చేయడం, సంక్లిష్టమైన నోట్స్ భాగాలను సులభంగా సారాంశంగా మార్చడం, పరీక్షల కోసం ప్రాక్టీస్ క్విజ్లు రూపొందించడం వంటి సేవలను కూడా అందిస్తుంది. చైనాలోని హాంగ్జౌ నగరంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఏఐ ప్రొడక్ట్ మార్కెటింగ్ పోటీల్లో 50 మంది పోటీదారులతో తలపడిన షుహాన్ మూడో బహుమతిగా 5,000 యువాన్లను గెలుచుకుంది. ఈ పోటీల్లో న్యాయమూర్తులు ఎవరూ లేకపోవడం, ఉత్పత్తుల అమ్మకాల ద్వారా లభించిన రాబడి ఆధారంగా విజేతలను ఎంపిక చేయడం విశేషం.పిల్లల్లో స్వయంగా మార్పు వచ్చేలా మెత్తని వైఖరితో ఈ యాప్ పని చేస్తుందని, ఆలోచన బాగుంటే ఏఐ సహాయంతో దేనికైనా ప్రాణం పోయవచ్చని ఈ చిన్నారి స్పష్టం చేసింది. ప్రస్తుతం తన తమ్ముడే ఈ యాప్ను మొదటగా ఉపయోగిస్తున్నాడని, దీని పర్యవేక్షణ తర్వాత అతడు ఎంతో శ్రద్ధగా చదువుకుంటున్నాడని షుహాన్ సంతోషంగా తెలిపింది.



