
ఈగ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా
మన దేశంలో చాలా రకాల పక్షులు ఉన్నాయి. పక్షులు ఒక్కో ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసలు వెళుతూ ఉంటాయి.. వస్తూ ఉంటాయి. కానీ, కుప్పలు తెప్పలుగా ఒకే గ్రామంలో చనిపోవడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ సంఘటన అస్సాంలోని డిమా హసావో జిల్లాలోని జటింగాలో ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. పక్షులు ఇలా ఎందుకు చనిపోతున్నాయి? ఇక్కడ మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో చివరలో సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య అమావాస్య లేదా చీకటి రాత్రుల్లో ఈ వింత జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల సమయంలో దట్టమైన పొగమంచు, ఈదురుగాలులు, వర్షం ఉన్నప్పుడు పక్షులు ఉన్నట్లుండి.. గ్రామంలో వెలుగుతున్న దీపాల వైపు దూసుకొచ్చు కింద పడిపోతూ ఉంటాయి. పక్షులు నిజంగా ఆత్మహత్య చేసుకుంటాయా అంటే.. చేసుకోవు. జీవశాస్త్రం ప్రకారం పక్షులకు 'ఆత్మహత్య' చేసుకునే ఉద్దేశం లేదా ఆలోచనా శక్తి ఉండదు. అసలు కారణం దిశానిర్దేశం కోల్పోవడం వల్ల ఇలా జరుగుతుంది. భారీ గాలులు, దట్టమైన పొగమంచు ఉన్నప్పుడు పక్షులు ఎటు ఎగరాలో తెలియక అయోమయానికి గురవుతాయి. ఆ కారుచీకట్లో గ్రామంలోని దీపాలు లేదా గ్రామస్తులు వెలిగించిన మంటల వెలుతురు మాత్రమే వాటికి కనిపిస్తుంది. ఆ కాంతి వైపు అత్యంత వేగంగా దూసుకువచ్చే క్రమంలో.. వాతావరణంలో అస్పష్టంగా ఉండే చెట్లు, ఇళ్ల గోడలు, కరెంటు స్తంభాలను బలంగా ఢీకొడతాయి. ఆ దెబ్బకు గాయాలపాలై, స్పృహతప్పి నేలకూలుతాయి. చాలామంది ఇవి సుదూర ప్రాంతాల నుండి వచ్చే వలస పక్షులు అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. పాండ్ హెరాన్, కింగ్ఫిషర్, టైగర్ బిట్టర్న్ వంటి సుమారు 44 రకాల స్థానిక అటవీ పక్షులే ఈ ప్రమాదానికి గురవుతాయి. వీటిలో ఎక్కువ శాతం సరిగ్గా ఎగరడం తెలియని చిన్న పక్షులు ఉంటాయి. దశాబ్దాల క్రితం, రాత్రిపూట ఆకాశం నుంచి కిందపడుతున్న పక్షులను















