నిమిషం•Telangana•11 ఆగ
బంగాళాఖాతంలో అల్పపీడనం అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పాటు తీవ్రమైన ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బుధవారానికి బలమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాబోయే మూడు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఆగస్టు 10 నుంచి 17 వరకు రెండు రాష్ట్రాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయి. ఆంధ్రప్రదేశ్లో రాత్రి నుంచే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యాయి. నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడటంతో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. మంగళవారం రోజున విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని నగరి, అగ్రం, పిచ్చాటూరు, విజయపురం, కన్నవరం, సత్యవేడు, పుత్తూరు, నిండ్ర ప్రాంతాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రాబోయే కొన్ని గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. రాయలసీమలో మాత్రం వర్షపాతం ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ బలమైన ఈదురుగాలులు వీస్తాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 10 రాత్రి నుంచే అనేక జిల్లాల్లో వాతావరణం మారిపోయింది. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సంగారెడ్డి జిల్లా నాగలగిద్దలో 2.35 సెం.మీ, కరీంనగర్ జిల్లా హూజూరాబాద్లో 2.11 సెం.మీ, మెదక్ జిల్లా నర్సింగిలో 2.03 సెం.మీ వర్షపాతం నమోదైంది