నాంపల్లికి ఆ పేరు ఎలా వచ్చింది? 350 ఏళ్ల నాటి హైదరాబాద్ చరిత్రలో ఆసక్తికర కథ
హైదరాబాద్లోని ప్రముఖ ప్రాంతాల్లో నాంపల్లి ఒకటి. నాంపల్లి రైల్వే స్టేషన్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్స్ వంటివాటితో నగర చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయం మాత్రం చాలామందికి తెలియదు. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల పేర్ల వెనుక నిజాం కాలం నాటి వ్యక్తులు, జాగీర్లు, గ్రామాలు, స్థానిక భౌగోళిక పరిస్థితులకు సంబంధించిన కథలు ఉన్నాయి. నాంపల్లి పేరు విషయంలోనూ ప్రధానంగా ఒక చారిత్రక కథనం ప్రచారంలో ఉంది.చారిత్రకంగా ప్రాచుర్యంలో ఉన్న వివరాల ప్రకారం.. 1670లో రజా అలీఖాన్ అనే వ్యక్తి హైదరాబాద్ రాజ్యాన్ని పాలించిన నిజాం పాలకుల దర్బార్లో దివాన్గా పనిచేశారు. ఆయనకు 'నేక్నామ్ ఖాన్' అనే బిరుదు ఉండేది. ఆయనకు జాగీర్గా ఇచ్చిన ప్రాంతాన్ని నేక్నామ్ ఖాన్పల్లిగా పిలిచేవారని.. కాలక్రమంలో ఆ పేరు కాస్తా నాంపల్లిగా మారిందని పలు చరిత్ర ఆధారిత కథనాలు పేర్కొంటున్నాయి. నాంపల్లి పేరుకు సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఆ ప్రాంతం గతంలో తేమగా, నీటి వనరులతో కూడిన ప్రదేశంగా ఉండేదని, అక్కడి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పేరు ఏర్పడిందనే కథ ప్రాచుర్యంలో ఉంది. ఉర్దూలో నామ్ అంటే తేమగా ఉండే ప్రదేశమని.. పల్లి అంటే జాగా అని.. ఆ ప్రదేశం ఎప్పుడూ తడిగా తేమతోకూడిన జాగాగా ఉండటంతో దాన్ని 'నాంపల్లి' ప్రాంతంగా పిలిచే వారని కథనం కూడా ఉంది.నాంపల్లి పేరు వెనుక ఉన్న కథ ఏదైనా.. హైదరాబాద్ నగరం ఎలా విస్తరించిందో అర్థం చేసుకోవడానికి ఈ ప్రాంత చరిత్ర ఒక మంచి ఉదాహరణ. ఒకప్పుడు జాగీర్, గ్రామం చుట్టూ ఉన్న ప్రాంతంగా ఉన్న నాంపల్లి.. కాలక్రమంలో హైదరాబాద్ నగరంలో కీలక వాణిజ్య, రవాణా కేంద్రంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా నాంపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణంతో ఈ ప్రాంత ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ స్టేషన్ 1907లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో నిర్మించారు