
నేపాల్ వరదల్లో లేడీ పైలట్’ సాహసం.. ఆరు రోజుల్లో 100 రెస్క్యూ ఆపరేషన్లు.. ఎవరీప్రియా అధికారి
Priya Adhikari : నేపాల్ లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఊహించని విపత్తు కారణంగా మృతుల సంఖ్య వెయ్యికిపైగా చేరింది.. వేలాది మంది ఆచూకీ గల్లంతు కాగా.. ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యల్లో భాగంగా ఓ మహిళా పైలట్ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆమెనే.. నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్గా గుర్తింపు పొందిన ప్రియా అధికారి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆమె నేతృత్వంలో ఆరు రోజుల్లోనే సుమారు 100 రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టడం విశేషం. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, మట్టికొండలు విరిగిపడటంతో నేపాల్లో అనేక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రహదారులు, వంతెనలు ధ్వంసం కావడంతో కొన్ని ప్రాంతాలకు రహదారి మార్గంలో చేరుకోవడం కష్టంగా మారింది. దీంతో హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ పైలట్ ప్రియా అధికారి అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఆమె సారథ్యంలో రెస్క్యూ ఆపరేషన్లు చేస్తూ.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి సురక్షితంగా ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంతేకాక.. సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నవారికి అత్యవసర సహాయ సామగ్రిని చేరవేయడం వంటి కార్యకలాపాల్లో ఆమె ముందుండి పనిచేస్తున్నారు. నేపాల్లోని వరద ప్రభావిత రుసువా జిల్లాలోని తైమూర్ పట్టణం తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడి బాధితులను రక్షించేందుకు దాదాపు 20 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి. ఆ ఆపరేషన్లలో ప్రియా అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సవాళ్ల నడుమ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. ఒక్కోసారి ఐదారు హెలికాప్టర్లు ఒకేచోట దిగుతున్నాయి. బాధితులను తరలించడానికి రేడియో ద్వారా సమన్వయం చేసుకుంటున్నాం. భారీగా బురద ఉన్న ప్రాంతంలో చాపర్లు దిగడం కష్టంగా మారుతోంది. దీంతో బాధితులను ఎక్కించడం ప్రమాదంతో కూడుకున్న పని.. ఆపరేషన్ కొనసాగుతున్నంత సేపు పైలట్లు చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి











