
విశాఖనుప్రీమియర్ హెల్త్ కేర్ హబ్ గా మారుస్తాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రీమియర్ హెల్త్కేర్ సేవలను విస్తరించే దిశగా విశాఖపట్నంలో ఏఐజీ హాస్పిటల్స్ భారీ ప్రాజెక్టును చేపట్టింది. సుమారు 2,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న 1,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఏఐజీ హాస్పిటల్స్ క్యాంపస్కు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు హైదరాబాద్ స్థాయి ఉచిత, సంక్లిష్ట వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ ఇంటిగ్రేటెడ్ హెల్త్కేర్, అకడమిక్ మరియు రీసెర్చ్ క్యాంపస్ను ఏఐజీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టును ఐదేళ్ల కాలవ్యవధిలో దశలవారీగా అభివృద్ధి చేయడానికి ఏఐజీ హాస్పిటల్స్ యజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 9 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆసుపత్రి భవనం, మరో 2.5 ఎకరాల్లో నర్సింగ్ కాలేజీ మరియు అనుబంధ సౌకర్యాలను నిర్మిస్తారు. మొదటి దశలో 650 పడకల సామర్థ్యంతో టవర్ A, B లను 2028 అక్టోబర్ నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత రెండేళ్ల వ్యవధిలో రెండవ దశ కింద మరో 350 పడకల టవర్ C నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఏఐజీ హాస్పిటల్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్ట్ పనులు పూర్తయితే రోజువారీ ప్రాతిపదికన దాదాపు 5,000 మంది రోగులకు బాహ్య వైద్య సేవలు అందించవచ్చని ప్రతినిధులు వెల్లడించారు. దీంతో సంక్లిష్టమైన గ్యాస్ట్రో, లివర్, ట్రాన్స్ప్లాంట్, ఆంకాలజీ వంటి వైద్య చికిత్సల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఉత్తరాంధ్ర ప్రజలకు తప్పుతుంది. ఇదిలా ఉండగా ఈ క్యాంపస్ ద్వారా దాదాపు 9,000 మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో మదర్ అండ్ చైల్డ్ కేర్ ఫెసిలిటీతో పాటు 50కి పైగా స్పెషాలిటీ రంగాలు కూడా అందుబాటులో ఉంటాయి. దక్షిణ భారతదేశంలో విశాఖపట్నాన్ని ప్రధాన హెల్త్కేర్ హబ్గా తీర్చిదిద్దే వ్యూహంలో ఈ ఏఐజీ హాస్పిటల్స్ ప్రాజెక్ట్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది