
Updated on: Sep 13, 2026 | 5:20 PM
‘హనుమాన్ అంశ్’.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతున్న సినిమా పేరు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం, బోధనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. రికార్డు కలెక్షన్లు సాధిస్తూ ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్తో బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 205 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ రిలీజ్ కానుంది. మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హనుమాన్ అంశ్ తెలుగులో సమర్పిస్తున్నారు. కాగా ఇప్పుడీ బ్లాక్ బస్టర్ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.. అదేంటంటే.. ఈ చిత్రం ఆస్కార్స్లో పోటీపడే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయింది. ఈ విషయంపై చిత్ర నిర్మాత నమ్రతా సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘ ఆస్కార్స్లో ‘ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం’ విభాగంలో భారతదేశం తరపున హనుమాన్ అంశ్ అధికారిక ఎంట్రీ కోల్పోయింది. తాను సినిమా అంతర్జాతీయ విడుదల, తెలుగు డబ్బింగ్, ఇతర పనులతో బిజీగా ఉన్నందున ఈ విషయంపై మాకు పెద్దగా అవగాహన లేకపోయింది. ‘ఆస్కార్ కమిటీకి చిత్రాలను సమర్పించడానికి గడువు ముగిసిపోయింది. అధికారిక ఆస్కార్ ఎంట్రీని సమర్పించడానికి మేము తుది గడువును కోల్పోయాం. ఈ విషయంపై మాకు వరుసగా ఫోన్ కాల్స్ వచ్చాయి. మీరు సినిమాను ఎందుకు సమర్పించలేదని వారు అడిగినప్పుడు మాత్రమే మాకు ఈ విషయం తెలిసింది. ఈ గడువు గురించి మాకు అవగాహన లేదు. మేము ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాము. దీనికి తోడు మా బృందం చాలా చిన్నది, ‘హనుమాన్ అంశ్’ బృందం తెలుగు డబ్బింగ్, ఇతర భాషల్లో విడుదల ప్రణాళికలు, దివ్యాంగులకు చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం వంటి పనులతో బిజీగా ఉంది. ‘మేము ముందుగా తెలుగు డబ్బింగ్ పూర్తి చేశాము. ఆ తర్వాత ఇతర భాషల పనులు ప్రారంభిస్తాము. నటీనటులు, దర్శకుడు విశాల్ చతుర్వేది ప్రచార పర్యటనలో ఉన్నారు. ఆఫీసులో ఎవరూ లేరు,’ అని నమ్రత చెప్పుకొచ్చింది.
కాగా ప్రతిష్ఠాత్మక ‘హోంబలే ఫిల్మ్స్’ ద్వారా సెప్టెంబర్ 11న అంతర్జాతీయంగా విడుదలైన ‘హనుమాన్ అంశ్’ చిత్రం, సెప్టెంబర్ 18న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా తెలుగులో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మొదటి నుంచీ మూడు భాగాలుగా రూపొందించాలని ప్రణాళిక వేసినట్లు నిర్మాతలు తెలిపారు. మొదటి భాగంలో నీమ్ కరోలి బాబా తొలిరోజులను, ఉత్తరాఖండ్లోని కైంచి ధామ్తో ఆయనకున్న అనుబంధాన్ని చూపిస్తే, రెండో భాగం ఆయన జీవితంలోని మరింత లోతైన ఘట్టాలను వివరిస్తుంది. రెండో భాగం కథ బాబా జన్మస్థలమైన ఫిరోజాబాద్ నుండి ప్రారంభమై ఆగ్రా, మధుర వంటి ప్రదేశాలను కవర్ చేస్తుంది.
నిరంతర ప్రచారం, పని ఒత్తిడి కారణంగా రెండో భాగం పనులు ప్రారంభించడానికి కొంత సమయం పడుతుంది. “ఇంకా ఏమీ రాయలేదు. తదుపరి పని ప్రారంభించడానికి మాకు కనీసం రెండు నెలలు పడుతుంది. మేము గత ఏడాదిన్నరగా విరామం తీసుకోలేదు, కాబట్టి మాకు కనీసం 90 రోజుల విరామం కావాలి,” అని నమ్రత అన్నారు. మూడో భాగాన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్మిస్తం. ఇది భారతదేశం వెలుపల నీమ్ కరోలి బాబా ఆధ్యాత్మిక ప్రభావం, ఆయన అంతర్జాతీయ అనుచరుల కథను ఆవిష్కరిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





