
Rohit Sharma: ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ చివరి మ్యాచ్లో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించారు. ఆ ఇన్నింగ్స్ తర్వాత కూడా 2027 వన్డే ప్రపంచకప్లో ఆయన ఆడతారా లేదా అనే చర్చలు ఆగడం లేదు. హిట్ మ్యాన్ మళ్లీ మైదానంలో ఆడుతూ కనిపిస్తారా అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే సెప్టెంబర్ 2026లో వెస్టిండీస్తో జరగబోయే వన్డే సిరీస్కు రోహిత్ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
రోహిత్ శర్మ భవిష్యత్తుపై చీఫ్ సెలెక్టర్లు, బీసీసీఐ పెద్దల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆయనను జట్టు నుంచి తప్పించే కంటే తన సత్తా నిరూపించుకోవడానికి మరో అవకాశం ఇవ్వడమే సరైనదని నిర్ణయించారు. 2027 వరల్డ్ కప్ దృష్ట్యా వెస్టిండీస్ సిరీస్లో రోహిత్ ప్రదర్శన అత్యంత కీలకం కానుంది. ఆయన అనుభవం, ఆక్రమణ శైలి బ్యాటింగ్ జట్టు విజయాలకు ఎంతగానో ఉపయోగపడతాయని యాజమాన్యం భావిస్తోంది.
రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెట్టిన సెంచరీ
ఇంగ్లాండ్ పర్యటన సమయంలో రోహిత్ వన్డేలకు వీడ్కోలు చెప్తారనే వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం ఆయనను పక్కన పెడతారని, లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్ ఆయనకు చివరి వన్డే కావచ్చునని ప్రచారం జరిగింది. అలాంటి ప్రచారాలకు బ్యాట్తోనే సమాధానమిచ్చిన రోహిత్, క్లిష్ట సమయంలో సంచలన సెంచరీ సాధించి పెద్ద మ్యాచ్లలో తన ప్రాధాన్యత ఏంటో స్పష్టం చేశారు.
సెలెక్టర్ల ఆలోచనలు ఎలా ఉన్నా, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా రోహిత్కు సపోర్టుగా నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్ భవిష్యత్తు ప్రణాళికల్లో ఉన్నంతవరకు జట్టులోనే కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ప్రతి సిరీస్లో రోహిత్ ఫామ్ను నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్తో జరగబోయే వన్డే సిరీస్ హిట్ మ్యాన్ కెరీర్కు ఎంతో ముఖ్యమైనదిగా మారనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Found this helpful?
Share this story with your network










