
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో నాంపల్లిలోని ప్రత్యేక సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తమపై నమోదైన తీవ్ర అభియోగాల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ ప్రధాన నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. కేసులో ఏ1 ఎర్ర గంగిరెడ్డి, ఏ3 ఉమాశంకర్ రెడ్డి, ఏ6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన వేర్వేరు డిశ్చార్జ్ పిటిషన్లను సమగ్రంగా విచారించిన కోర్టు, వాటికి ఎలాంటి విచారణార్హత లేదని తేల్చిచెప్పింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లు, సాంకేతిక ఆధారాలు, సమర్పించిన సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... నిందితులపై ఉన్న అభియోగాలు విచారణకు అర్హమైనవేనని స్పష్టం చేసింది.