
తెలంగాణా రాష్ట్రానికి కేంద్రం మరో శుభవార్త చెప్పింది. తెలంగాణలో ఉత్తర ప్రాంతాలకు విమాన సౌకర్యం కల్పించేందుకు కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం వేగంగా సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే పూర్తి స్థాయిలో పనిచేస్తుండగా, ఆదిలాబాద్, వరంగల్, పెద్దపల్లి వంటి ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాలు రూపుదిద్దుకుంటున్నాయి.
ఆదిలాబాద్‌లో ఏర్పాటవుతున్న జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ప్రత్యేకమైనది. ఇక్కడ పౌర విమానాలు, భారత వైమానిక దళం రెండూ ఉమ్మడిగా వినియోగించుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, యుటిలిటీల తరలింపు కోసం రూ.2,278.14 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 2,009 ఎకరాలు సేకరిస్తున్నారు. ఇందులో 1,609 ఎకరాలు వైమానిక దళం కోసం, 400 ఎకరాలు పౌర విమానయాన సౌకర్యాల కోసం కేటాయించారు. 9,000 అడుగుల రన్‌వేతో పెద్ద విమానాలు కూడా ఆపరేట్ చేయగలుగుతాయి.
ఆదిలాబాద్‌లో ఏర్పాటవుతున్న జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటుకు భూసేకరణను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు ఇటీవల సమీక్ష నిర్వహించి ప్రాజెక్టును మిషన్ మోడ్‌లో తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖా తెలంగాణా ప్రభుత్వం నుండి ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు నోడల్ ఆఫీసర్లను నియమించనున్నారు.
డీపీఆర్, మాస్టర్ ప్లాన్ రూపకల్పనను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు మరింత వేగవంతమయ్యేలా త్వరలో నోడల్ అధికారులతో కమిటీని నియయమిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రక్షణశాఖ, పౌరవిమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరు ఈ కమిటీలో ఉంటారని చెప్పారు.
పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి ఆయన రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమైన ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ విమానాశ్రయంలో జాయింట్ యూజర్ ఎయిర్‌‌‌‌ఫీల్డ్ ను అభివృద్ధి చేసేందుకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. 2.75కిలోమీటర్ల రన్ వే నిర్మాణానికి భారత విమానదళం వద్ద గల 369.45ఎకరాలకు అదనంగా మరో 1,500ఎకరాలను సేకరించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
ఉత్తర తెలంగాణలో విమాన సౌకర్యం లేక ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఈ విమానాశ్రయం వల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు వ్యాపారం, పర్యాటకం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్ట్ కూడా పురోగతిలో ఉంది. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో కూడా ప్రతిపాదనలు ఉన్నాయి.ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ తో ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన మార్పు రానుంది.






