
30 వరకు గడువు పొడిగింపు సొంతంగా ఈకేవైసీకీ అవకాశం ఈ-పంటలో వివరాలు నమోదు చేస్తున్న వ్యవసాయ సిబ్బంది నరసరావుపేట వ్యవసాయం, రొంపిచర్ల, సత్తెనపల్లి, న్యూస్‌టుడే: ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల కారణంగా పంటకు నష్టం వాటిల్లితే రైతుకు పరిహారం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన అమల్లోకి తెచ్చాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఆగస్టు 31తో బీమా నమోదు పూర్తయింది. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుందని చాలామంది రైతులు భావిస్తున్నారు. అయితే బీమా ప్రీమియం చెల్లిస్తే పరిహారం అందదు. తప్పనిసరిగా ఈ-పంట నమోదు, ఈకేవైసీ పూర్తి చేయాలి. ఈ-పంటలో నమోదైన పంటే బీమాలోనూ నమోదు కావాలి. ఈ రెండింటి వివరాల్లో తేడా ఉన్నా పరిహారం అందదు. ఈ-పంట, ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం ఈ నెల 30 వరకు గడువు ఇచ్చింది. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజనలో ఆధారిత పంటల బీమా కింద వరి, కంది, మిర్చి.. వాతావరణ ఆధారిత పంటల బీమా కింద పత్తి పంటకు అవకాశం కల్పించారు. ఇప్పటికే రైతులు వివిధ పంటలకు ప్రీమియం చెల్లించారు. జిల్లాలో 53,516 మంది 4,809 హెక్టార్లలో వరి, కంది, మిర్చికి బీమా నమోదు చేయించుకున్నారు. పత్తికి సంబంధించి 7,275 మంది 6,500 హెక్టార్లకు బీమా చేశారు. మూడు విధానాల్లో ఈ-పంట నమోదు.. రైతులు ఈ-పంటలో తమ వివరాలను మూడు విధాలుగా నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. రైతులే సొంతంగా ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ను తమ సెల్‌ఫోన్లలో డౌన్‌లోడు చేసుకుని ఆధార్‌తో లాగిన్‌ అవ్వాలి. తమ పేరిట ఉన్న భూమిలో ఏ సర్వే నంబరులో ఏ పంట వేశారో నమోదు చేసుకుని ఈ-కేవైసీ కూడా చేయొచ్చు. రైతుసేవా కేంద్రాల్లో సిబ్బంది ద్వారా నమోదు చేయించుకోవచ్చు. ప్రయోజనాలెన్నో.. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ-పంటలో నమోదైతేనే రైతులకు పలు ప్రయోజనాలు అందుతాయని డీఏవో జగ్గారావు తెలిపారు. వర్షాభావం, అధిక వర్షాలు, తెగుళ్లు తదితర కారణాలతో పంటలు దెబ్బతింటే ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయానికి దీనినే ప్రాతిపదికగా తీసుకుంటారని, బీమా పరిహారం అందిస్తారన్నారు. వ్యవసాయ రుణాలు, యంత్ర పరికరాలు, ఎరువులు తదితర ప్రయోజనాలు అందుతాయన్నారు. ఈ-పంట నమోదు చేయాల్సిన భూభాగాలు: 10,38,540 ఇప్పటి వరకు నమోదు చేసింది: 6,43,895 .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.