
ఈ మధ్యన ప్రముఖ వ్యక్తులు, నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా ఈ రియల్ స్టోరీలను చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో వస్తోన్న రియల్ క్రైమ్ స్టోరీలకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక రియల్ స్టోరీనే. కొన్నేళ్ల క్రితం తమిళనాడులో జరిగిన దారుణ ఘటన ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. కొన్నేళ్ల క్రితం తమిళనాడులో నిజంగానే జరిగిన కథ ఇది. సుమతి (సాయి పల్లవి) తండ్రి (ప్రకాష్ రాజ్) కు చెప్పకుండా పెళ్లి చేసుకుంటుంది. భర్తతో కలిసి సుఖంగా సిటీలో బతుకుతుంటుంది. ఇదే క్రమంలో ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు రెడీగా ఉంటోంది. అయితే ఇంతలోనే తండ్రి ఆమెను వెతుక్కుంటూ ఇంటికి వస్తాడు. కొన్ని రోజులు ఆమెతోనే ఉండి సీమంతం చేస్తామంటూ కూతురిని ఇంటికి తీసుకెళతాడు. ఇక రేపు సీమంతం అనగా తండ్రిలోకి కర్కషుడు బయటకు వస్తాడు. అందరూ పడుకున్న తర్వాత పాలలో విషం కలిపి కూతురికి ఇస్తాడు. విషం తాగిన సుమతి రక్తం కక్కుకుని మరణిస్తుంది. పరువు కోసం కన్న తండ్రి చేసిన ఈ దారుణమైన దుశ్చర్య అందరినీ కంటతడి పెట్టిస్తుంది. మన చుట్టూ ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అందరూ ముక్కున వేలేసుకుంటారు. ముఖ్యంగా చివరి అయిదు నిమిషాల్లో ప్రకాష్ రాజ్-సాయిపల్లవి నడుమ సన్నివేశాలు మనసును కదిలిస్తాయి.