
మహిళా ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌కు నెల్లూరు యువతుల ఎంపిక న్యూస్‌టుడే, నెల్లూరు (క్రీడా విభాగం): జిల్లాకు చెందిన పలువురు యువతులు క్రికెట్‌లో రాణిస్తూ.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు. ఈ నెల 19 నుంచి మంగళగిరిలో జరగనున్న మహిళా ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌కు జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు ఎంపికయ్యారు. రాయలసీమ జెన్‌ స్టార్స్‌ జట్టుకు సజ్జా సాయి శ్రీలక్ష్మి.. గోదావరి గోల్డెన్‌ ఈగల్స్‌ జట్టుకు మహాలక్ష్మి మనోజ ఎంపికవగా.. భారత జట్టులో స్థానమే లక్ష్యంగా వీరు ముందుకు సాగుతున్నారు. ఆలిండియా బెస్ట్‌ బౌలరుగా.. సజ్జా సాయిశ్రీలక్ష్మి... ప్రస్తుతం తిరుపతిలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. క్రికెట్‌ అంటే ప్రాణం కావడంతో చిన్నప్పటి నుంచే ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ.. ఏడో తరగతి నుంచే మెలకువలు నేర్చుకుంది. అండర్‌-16 విభాగంలో మూడుసార్లు రాష్ట్రస్థాయి జట్టుకు ప్రాతినిధ్యం వహించగా, ఒక మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించింది. అండర్‌-19 విభాగంలో జైపుర్, రాజ్‌కోట్, ముంబయిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జట్టులో ప్రాతినిధ్యం వహించి ప్రతిభ చూపింది. అండర్‌-19 ట్వంటీ-ట్వంటీ పోటీలు రాజ్క్‌ోట్‌లో జరగ్గా.. బెస్ట్‌ బౌలరుగా రాణించారు. ప్రస్తుతం ఆమె ఆల్‌ రౌండర్‌గా వ్యవహరిస్తున్నారు. 2019లో గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అయిదు వికెట్లు తీసి రికార్డు సాధించగా, జిల్లా స్థాయి పోటీల్లో 154 పరుగులు చేసి ఆల్‌ రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన అండర్‌-23 సీనియర్స్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. వికెట్‌ కీపర్, బ్యాటర్‌గా.. నెల్లూరు నగరానికి చెందిన మహాలక్ష్మి మనోజ.. ఇంటర్మీడియట్‌ చదువుతోంది. ఆరో తరగతి నుంచే క్రికెట్‌ అంటే ప్రాణం కావడంతో సీనియర్‌ క్రికెట్‌ క్రీడాకారుడు రాజా దగ్గర శిక్షణకు చేర్పించారు. క్రికెట్‌లో ఎన్నో పతకాలు సాధించింది. గతేడాది మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో జరిగిన అండర్‌-15 క్రికెట్‌ రాష్ట్ర జట్టులో నెల్లూరు నుంచి పాల్గొంది. 2024లో వెంకటగిరిలో సౌత్‌ జోన్‌ పోటీల్లో పాల్గొని రాష్ట్ర ప్రాబబుల్స్‌కు ఎంపికైంది. ఈ ఏడాది మదనపల్లిలో జరిగిన అండర్‌-23 పోటీల్లో 167 అత్యధిక పరుగులు చేసి రికార్డు నెలకొల్పింది. వైజాగ్‌లో జరిగిన అండర్‌-23 సీనియర్స్‌ ప్రాబబుల్స్‌ పోటీల్లో 105 బంతులకు వంద పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




