
మంత్రి లోకేశ్‌ పర్యటన విజయవంతం సమావేశానికి హాజరైన కార్యకర్తల ఉత్సాహం ఈనాడు, నెల్లూరు, న్యూస్‌టుడే, నెల్లూరు(విద్య), నగరపాలకసంస్థ, బీవీనగర్, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం: శ్రేణుల ర్యాలీలు.. గజమాలలతో స్వాగతాలు.. అభిమానులతో కరచాలనం.. మంత్రి నారాలోకేశ్‌ పర్యటన బుధవారం నగరంలో సందడిగా సాగింది. షెడ్యూల్‌ ప్రకారమే నెల్లూరు నగర, కోవూరులో కార్యక్రమాలు పూర్తి చేసుకుని రోడ్డుమార్గాన మంగళగిరికి పయనమయ్యారు. పర్యటన విజయవంతమవడంతో పోలీసులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రోడ్లకు ఇరువైపులా పసుపుజెండాల రెపరెపలు, స్వాగత ఫ్లెక్సీలు.. బాణసంచా కాల్చుతూ తెదేపా శ్రేణుల ఉత్సాహం.. జై లోకేశ్‌ బాబు నినాదాలు హోరెత్తాయి. మెడికవర్‌ ఆసుపత్రి కూడలి నుంచి శ్రేణులు బైక్‌ ర్యాలీ చేపట్టాయి. అభిమానులు, కార్యకర్తలు, శ్రేణులకు కారులో నుంచే అభివాదం, కరచాలనం చేస్తూ ఆప్యాయంగా పలకరించారు. వినతిపత్రాలు స్వీకరిస్తూ స్టోన్‌హౌస్‌పేటలోని ఆర్‌ఎస్‌ఆర్‌ హైస్కూలుకు చేరుకున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఫరూఖ్, మంత్రి నారాయణ, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రశాంతిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కలెక్టర్‌ హిమాన్షుశుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం ఎన్‌సీసీ విద్యార్థినుల గౌరవ వందనం స్వీకరించి ముందుకుసాగారు. మంత్రి లోకేశ్‌ పాఠశాల ప్రారంభోత్సవ శిలాఫలకం ఆవిష్కరించారు. వీపీఆర్‌ ఫౌండేషన్‌తో ఆధునికీకరించిన ఆర్‌ఎస్‌ఆర్‌ నూతన స్కూలు, ఆధునిక సౌకర్యాల గురించి మంత్రి నారాయణ కుమార్తె షరణి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి లోకేశ్‌కు వివరించారు. ఉదయం 11:53 నిమిషాలకు మూలాపేటలోని డీఎస్‌ఆర్‌ బాలికోన్నత పాఠశాలకు చేరుకుని ప్రారంభోత్సవ శిలాఫలకం ఆవిష్కరించారు. గదుల్లో కలియతిరిగి సౌకర్యాలు పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెబుతున్నారు? ఏమైనా సమస్యలున్నాయా? అడిగి తెలుసుకున్నారు. అనంతరం 12:40 నిమిషాలకు కోవూరుకు బయలుదేరారు. మంత్రి లోకేశ్, వేమిరెడ్డి దంపతులకు గజమాలతో స్వాగతం కోవూరులో బాణసంచా మోతలు.. కోలాట నృత్యాలు, అశ్వకదళాలతో రోడ్లు జాతరను తలపించాయి. భారీ ర్యాలీ.. అడుగడుగునా గజమాలలు.. వేలాది కార్యకర్తల నడుమ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మంత్రి లోకేశ్‌కు స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి కోవూరుకు రావడంతో అభిమానులు, కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు లోకేశ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్‌ విగ్రహం ఆవిష్కరణ అనంతరం కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు. తర్వాత అందరితో ఫొటోలు దిగుతూ ఉత్సాహపరిచారు. పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, అర్జున్‌రెడ్డి రిబ్బను కత్తిరించి డీఎస్‌ఆర్‌ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభిస్తున్న మంత్రులు లోకేశ్, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, చిత్రంలో షరణి ఆర్‌ఎస్‌ఆర్‌ పాఠశాల విద్యార్థులతో.. బాలల అభ్యసన సామర్థ్యం తెలుసుకుంటూ.. ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు హాజరైన అభిమానులు .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.