
Monsoon Withdrawal : దేశంలో నైరుతి రుతుపవనాల (southwest monsoon) తిరోగమన ప్రక్రియ ప్రారంభానికి సమయం దగ్గరపడిందని భారత వాతావరణ కేంద్రం (IMD) అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 19 నుంచి పశ్చిమ రాజస్థాన్ (Rajasthan) లోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నది. సాధారణంగా సెప్టెంబర్ 17న ప్రారంభం కావాల్సిన ఈ ప్రక్రియ ఈ ఏడాది రెండు రోజులు ఆలస్యంగా మొదలవుతోంది. రాజస్థాన్లో ఉపసంహరణ ప్రారంభమైనప్పటికీ.. మధ్య, తూర్పు, దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో సెప్టెంబర్ 21 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టంచేసింది. ముఖ్యంగా 18 నుంచి 20 మధ్య కోస్తాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం రుతుపవనాలపై తీవ్రంగా పడింది. సెప్టెంబర్ 13 నాటికి దేశవ్యాప్తంగా 15 శాతం మేర వర్షపాతలోటు నమోదైంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో 28 శాతం తక్కువ వర్షపాతం నమోదవడం గమనార్హం. రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో 43 శాతం, కర్ణాటకలో 29 శాతం, కేరళలో 27 శాతం మేర వర్షపాత లోటు నమోదైంది.