
తిరుమల కొండపై చిరుత సంచారం మళ్లీ కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి వేళ తిరుమలలోని జీఎన్సీ (GNC) టోల్గేట్కు అత్యంత సమీపంలో ఉన్న నడకదారి వద్ద ఓ చిరుతపులి ప్రత్యక్షమైంది. రహదారి పరిసరాల్లో అది కొద్దిసేపు నిశ్చింతగా సంచరించడాన్ని గమనించిన స్థానికులు, టీటీడీ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో నడకదారిలో భక్తుల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపు టోల్గేట్ సమీపంలోనే సంచరించిన ఆ చిరుత, అనంతరం పక్కనే ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. నిరంతరం భక్తుల రద్దీ ఉండే ప్రాంతంలోనే చిరుత కనిపించడంతో కాలినడకన వచ్చే భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఘాట్ రోడ్లు, నడకదారుల పరిసరాల్లో తరచూ క్రూరమృగాలు సంచరిస్తున్న నేపథ్యంలో, రాత్రి వేళల్లో ప్రయాణించే భక్తులు గుంపులుగా వెళ్లాలని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.




