
మంత్రాలయం భారీ చోరీ కేసులో నిందితురాలి అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : రద్దీ ప్రదేశాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకొని నగలు, బ్యాగులను దొంగలిస్తున్న నంద్యాల జిల్లా సిద్ధాపురానికి చెందిన వాణిశ్రీ అలియాస్‌ వాణిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్‌పాటిల్, కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర, మూడో పట్టణ సీఐ శేషయ్య, నాలుగో పట్టణ సీఐ విక్రమ్‌సింహతో కలిసి బుధవారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ః ప్రస్తుతం కర్నూలు నగరంలో నివసిస్తున్న వాణిశ్రీ విలాసవంతమైన జీవితం గడిపేందుకు చోరీలను ఎంచుకుంది. పుణ్యకేత్రాలు, బస్టాండు తదితర రద్దీ ప్రదేశాల్లో అప్రమత్తంగా లేని మహిళ బ్యాగులను అపహరించేది. ఈ ఏడాది ఆగస్టు 29న తిరుపతికి చెందిన ఓ మహిళ మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలకు హాజరయ్యారు. ఆలయ ఆవరణలో ఆమెకు చెందిన 24 తులాల బంగారు ఆభరణాలున్న బ్యాగు చోరీకి గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజీని నిశితంగా పరిశీలించి అనుమానాస్పదంగా కనిపించిన ఓ మహిళను గుర్తించారు. అన్ని పోలీసుస్టేషన్‌లకు ఆమె ఫొటోలు, వీడియోలు పంపారు. కర్నూలు పోలీసులు అనుమానిత మహిళను వాణిశ్రీగా గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించడంతో నేరం అంగీకరించింది. ఆమె పాల్పడిన మరికొన్ని చోరీల వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఆగస్టు 8వ తేదీన ఆర్టీసీ బస్సు ఎక్కిన మిడుతూరు మండలం బైరాపురానికి చెందిన కదిరె జయమ్మ నుంచి 4 తులాల బంగారు ఆభరణాలున్న బ్యాగును కొట్టేసింది. జూన్‌ 22న కర్నూలు ఆర్టీసీ బస్టాండులో బస్సెక్కుతున్న ఓ మహిళ నుంచి 3 తులాల బంగారు నగలున్న చేతిసంచిని, 2025 నవంబరు 12న కర్నూలులోని సి.క్యాంపు వద్ద బస్సెక్కిన దొర్నిపాడుకు చెందిన శారదాదేవి బ్యాగులోని 3 తులాల నగలను వాణిశ్రీ చోరీ చేసినట్లు విచారణలో తేలింది. నాలుగు కేసులకు సంబంధించి ఆమె నుంచి 30 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితురాలిని పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డు అందజేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.