
Updated on: Sep 13, 2026 | 3:25 PM
పదవులు వస్తుంటాయ్, పోతుంటాయ్.. ప్రజల్లో ఉండేవాళ్లే అసలైన నాయకులు.. ఎంపీటీసీ నుంచి ఈ స్థాయికి ఎదిగాం.. కష్టకాలంలో కార్యకర్తలంతా వెన్నంటి నిలిచారంటూ మాజీ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. అంతేకాకుండా.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ నాయకుడిని నమ్ముకుంటే ఆ బంధం అలా కొనసాగేదని.. ఇప్పుడు అవకాశవాద రాజకీయం పెరిగిపోయిందన్నారు. అంతేకాకుండా.. పార్టీ మార్పు ఊహాగానాలపై కొండా దంపతులు క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్లోనే కొనసాగుతామని స్పష్టం చేసిన కొండా దంపతులు.. రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యమన్నారు.
ఆదివారం కొండా దంపతులు అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. కాంగ్రెస్లోనే పుట్టాం.. కాంగ్రెస్లోనే పెరిగాం.. కాంగ్రెస్లోనే ఉంటామన్నారు. పైనుంచి తమకు చాలా ఫోన్లు వస్తున్నాయని.. పార్టీ అండగా ఉంటుందని పెద్దలు భరోసా ఇస్తున్నారన్నారు. తాము కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదని.. మళ్లీ వరంగల్ ఈస్ట్లో పోటీచేసి గెలుస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మరోసారి మంత్రిని అవుతానంటూ సురేఖ ధీమా వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ పార్టీలో కొన్ని గుంటనక్కలున్నాయని.. వైఎస్ చనిపోయాక తమను టార్గెట్ చేయడం మొదలెట్టారన్నారు. రేవంత్రెడ్డికి మొదట మద్దతుగా నిలిచింది తామేనన్నారు. తనకిచ్చిన మూడు శాఖల్ని అవినీతి మరకలేకుండా నిర్వర్తించానని.. పదవులు తమకు అలంకారం మాత్రమేనన్నారు. ప్రజల్లో నిలబడ్డవారే అసలైన నాయకులన్నారు. తనను బర్తరఫ్ చేశారనే బాధ లేదని.. అకారణంగా పదవి నుంచి తొలగించారన్నదే తన ఆవేదనంటూ పేర్కొన్నారు. పార్టీలోకి నిన్నమొన్న వచ్చినవారు సైతం మాపై మాట్లాడుతున్నారంటూ విమర్శలు చేశారు.
కొండా మురణి మాట్లాడుతూ.. కృతజ్ఞత తమ రక్తంలోనే ఉందన్నారు. పదవుల కోసం పార్టీమారే సంస్కృతి తమది కాదని.. రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.






