
6 Indians Among Crew Onboard Cameroon Flagged Ship Captured By Pirates
Ship Hijacked Off Somalia Coast : సోమాలియాలోని పుంట్ల్యాండ్ ప్రాంత తీరప్రాంతంలో సముద్రపు దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఆఫ్రికన్ దేశమైన కామెరూన్ జెండాతో ప్రయాణిస్తున్న 'లుటుఫ్' అనే వాణిజ్య కార్గో నౌకను అపహరించి, తమ...
Ship Hijacked Off Somalia Coast : సోమాలియాలోని పుంట్ల్యాండ్ ప్రాంత తీరప్రాంతంలో సముద్రపు దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఆఫ్రికన్ దేశమైన కామెరూన్ జెండాతో ప్రయాణిస్తున్న 'లుటుఫ్' అనే వాణిజ్య కార్గో నౌకను అపహరించి, తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ నౌకలో మొత్తం 10 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా.. వారిలో ఆరుగురు భారతీయ నావికులు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పోలార్ మూవ్మెంట్ షిప్పింగ్ సంస్థకు చెందిన ఈ నౌకలో ఆయుధాలు, కమ్యూనికేషన్, శాటిలైట్ పరికరాలు రవాణా అవుతున్నాయి. సోమాలియాలోని మొగదిషులో ఉన్న టర్కీ సైనిక శిక్షణ కేంద్రానికి ఈ ఆయుధ సామాగ్రిని చేరవేసే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వారంలో పుంట్ల్యాండ్ పరిధిలోని ఈల్ జిల్లా, మర్రాయ ప్రాంతానికి దాదాపు మూడున్నర నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న సమయంలో దొంగలు దాడి చేసి నౌకను తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ నౌకను నుగాల్ తీరప్రాంతంలోని దంగోరోయో జిల్లా గర్మాల్ సమీపానికి తరలించారు.వివిధ దేశాలకు చెందిన సిబ్బంది బందీ..హైజాక్కు గురైన ఈ నౌకలో ఆరుగురు భారతీయ సముద్ర నావికులతో పాటుగా ఒక టర్కీ పౌరుడు, ఒక జార్జియా పౌరుడు భద్రత కోసం నియమించబడిన ఇద్దరు సెర్బియా సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. గత ఏప్రిల్ 26వ తేదీన 'స్వార్డ్' అనే మరొక వ్యాపార నౌకను హైజాక్ చేసిన ఎనిమిది మంది సభ్యుల పైరేట్స్ బృందమే ఈ దాడులకు పాల్పడి ఉంటుందని స్థానిక అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ భయాందోళనకర ఘటనపై భారత ప్రభుత్వం గానీ టర్కీ అధికార వర్గాలు గానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.నౌక అపహరణకు గురైన విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. టర్కీకి చెందిన రెండు నౌకలు ఈ హైజాక్ అయిన నౌకను సమీపించగా.. టర్కీ హెలికాప్టర్లు, డ్రోన్లు గాల్లోకి లేచి ఆ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించాయి. ఈ క్రమంలో మంగళవారం రోజున ఒక చిన్న పడవలో ఇద్దరు వ్యక్తులు వచ్చి, సోమాలియాలో విస్తృతంగా ఉపయోగించే 'ఖత్' అనే పదార్థాన్ని నౌకలోని వారికి అందించినట్లు తెలిసింది. ఈ పదార్థాన్ని తీసుకున్న వాళ్లు పడుకోకుండా, చాలా చురుగ్గా ఉంటారు.దాడిలో నలుగురు మృతి..!ఆ పడవ తిరిగి తీరానికి చేరుకున్న కొద్దిసేపటికే ఆ ప్రాంతంలో వైమానిక దాడి జరిగింది. ఈ తీవ్ర దాడిలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడులను ఎవరు నిర్వహించారు? మరణించిన వారు హైజాకింగ్ చర్యల్లో పాల్గొన్న పైరేట్లేనా? అనే విషయాలను ఇంకా అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. అలాగే ప్రస్తుతం 'లుటుఫ్' నౌక పరిస్థితి, అందులోని భారతీయ నావికులతో సహా ఇతర సిబ్బంది భద్రతకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.






