
అందకపోవడంపై సుప్రీంకోర్టు విచారం దిల్లీ: సైనికులు గాయపడినప్పుడు అందాల్సిన ప్రయోజనాలను అత్యంత సాంకేతిక కారణాలతో తిరస్కరిస్తుండటంపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తంచేసింది. వారిమీద కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్న సిఫార్సుల్ని అమలు చేయకపోవడంపై అసంతృప్తి వెలిబుచ్చింది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో అంగవికలురైన సైనికులకు ఇప్పటికీ వైకల్య ప్రయోజనాలు అందడం లేదని 2015లో రక్షణ మంత్రిత్వశాఖ నివేదిక వెలువడిన విషయాన్ని జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహా, జస్టిస్‌ ఆలోక్‌ అరాధేల ధర్మాసనం మంగళవారం గుర్తుచేసింది. కేంద్రం చేసిన 271 అప్పీళ్లను కొట్టివేస్తూ మాజీ సైనికులకు వైకల్య పింఛన్‌ ఇవ్వాలని ఆదేశించింది. ఇలాంటి వ్యాజ్యాలను ఉపసంహరించుకునేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపినా, ప్రభుత్వం తరఫున ఇంకా అప్పీళ్లు వేస్తూనే ఉన్నారని ధర్మాసనం పేర్కొంది. ‘అటవీ (సంరక్షణ) సవరణ చట్టం-2023’ కింద అడవి నిర్వచనానికి ఉన్న రాజ్యాంగబద్ధ చెల్లుబాటుకు సవాల్‌పై విచారణ వరకే తాము పరిమితం అవుతామని సుప్రీంకోర్టు తెలిపింది. వ్యక్తిగత భూముల వివాదాలను సంబంధిత హైకోర్టులే విచారిస్తాయని స్పష్టం చేసింది. 1996లో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పులో అడవికి ఉన్న నిర్వచనాన్ని పలుచన చేసేలా 2023 చట్టం ఉందంటూ విశ్రాంత అటవీ శాఖాధికారి అశోక్‌ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. స్వీయ నిర్వచనాన్ని ఇచ్చే హక్కు పార్లమెంటుకే ఉందని, తాము దానిని గౌరవిస్తూనే.. ఏదైనా వైరుద్ధ్యం ఉందా అనేది చూస్తామని తెలిపింది. అటవీ భూములు, వర్గీకరించని సామాజిక అటవీ భూములపై సమగ్ర నివేదికల్ని తయారుచేసేందుకు నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయని రాష్ట్రాలు వాటిని చేపట్టాలని ఆదేశించింది. ఒక రాజకీయ పార్టీ ఎవరిదని తేల్చడంలో, ముఖ్యంగా ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు పెండింగులో ఉన్న సమయంలో శాసనసభలో బలపరీక్ష నిర్వహించడం సురక్షితమేనా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మహారాష్ట్రలో శివసేన పార్టీలో చీలికల నేపథ్యంలో ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని వర్గానికి ఈ ప్రశ్న వేసింది. శాసనసభ్యుల అర్హతపైనే సమీక్ష జరుగుతున్నప్పుడు వారి సంఖ్యాబలంపై ఆధారపడటంలో న్యాయపరమైన సంక్లిష్టతలు తలెత్తవా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం శిందే వర్గం తరఫు న్యాయవాది నీరజ్‌ కిషన్‌ కౌల్‌కి ఈ ప్రశ్నను సంధించింది. బలపరీక్షే సరైన పరిష్కారమని కౌల్‌ చెప్పారు. నిరంకుశత్వ ధోరణి వల్ల కార్యకర్తల ఆకాంక్షల్ని పార్టీ ప్రతిబింబించలేకపోతోందన్నారు. ఏ వర్గానికీ పార్టీ చిహ్నాన్ని ఇవ్వకుండా, వేర్వేరు గుర్తులతో సొంత బలంపై పోటీ చేయాలని ఆదేశించడం ఒక పరిష్కారం కావచ్చని ధర్మాసనంలో ఉన్న జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చీ అన్నారు. శిందే వర్గాన్ని అసలైన శివసేనగా ఈసీ గుర్తించడాన్ని సవాల్‌ చేస్తూ ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై అసంపూర్తిగా ముగిసిన వాదనలు గురువారం కొనసాగనున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





