
విచారణ పేరుతో కాంగ్రెస్‌ ‘చీకటి ఒప్పందం’ బండి సంజయ్‌ ఆరోపణ ఆ భూములపై దండయాత్ర చేసి.. పేదలకు పంచుతామని వెల్లడి ఈనాడు డిజిటల్, కరీంనగర్‌: ‘ధరణి’ పేరుతో భారాస ప్రభుత్వ హయాంలో భూములను పల్లీ బఠాణీల్లా పంచుకుని కబ్జా చేశారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. భారాస నేతలు దోచుకున్న భూములపై భాజపా ఆధ్వర్యంలో దండయాత్ర చేస్తామన్నారు. ఆయా భూముల్లో కాషాయ జెండా ఎగరేసి పేదలకు పంచిపెడతామని ప్రకటించారు. కరీంనగర్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలకు భూముల్లేవు. 25 లక్షల కుటుంబాలకు ఇల్లు నిర్మించుకోవడానికి గజం స్థలం కూడా లేదు. కానీ, భారాస నేతలు మాత్రం వేల ఎకరాలు దోచుకున్నారు. బుల్లెట్‌ రైళ్ల కోసం కేటాయించిన భూములను సైతం కబ్జా చేశారు. భారాస నేతలు వేల ఎకరాలు కబ్జా చేశారని చెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి 1,000 రోజుల సమయం పట్టిందా? భారాస నేతలతో డీల్‌ కుదరకే ఈ వ్యవహారం బయటపెట్టారా? కలెక్టర్లకు పూర్తి అధికారాలిస్తే.. భూ కబ్జాలపై 24 గంటల్లో నివేదిక ఇస్తారు. అయినా 30 రోజుల గడువు పేరుతో డీల్‌ కుదుర్చుకోవాలనుకుంటున్నారా? విద్యుత్తు కొనుగోళ్లు, ఫార్ములా-ఈ రేసు, కాళేశ్వరం, గొర్రెల కొనుగోలు కుంభకోణాల విచారణలు ఏమయ్యాయి? అటవీ భూములు కబ్జా చేసిన వారిపై చర్యలేవి? కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలోని ప్రభుత్వ భూములను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు? భూములపై విచారణ పేరుతో భారాసతో కాంగ్రెస్‌ చీకటి ఒప్పందం చేసుకోవడం ఖాయం. ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవసరమైన డబ్బును ఈ భూకబ్జాదారులు సర్దడం తథ్యం. ఈ రెండు పార్టీల చీకటి ఒప్పందాలపై జనం తిరగబడే రోజులు రాబోతున్నాయి’’ అని బండి సంజయ్‌ అన్నారు. కార్యక్రమంలో కరీంనగర్‌ నగర మేయర్‌ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావు తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.