
న్యూఢిల్లీ: ప్రధాని మోదీని ఆయన మాజీ క్లాస్మేట్ కలుసుకున్నారు. బిల్డర్ సంస్థలు తన భూమిని ఆక్రమించినట్లు ఆయన ఆరోపించారు. చాలా కాలంగా వివాదం కొనసాగుతున్న ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఈ మేరకు ఒక లేఖను మోదీకి అందజేశారు. (Ex-Schoolmate Meets PM) మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మీరా-భయందర్కు చెందిన 81 ఏళ్ల అస్గరలీ వోహ్రా గతంలో గుజరాత్లోని వడ్నగర్లో ఉన్న బీఎన్ స్కూల్లో మోదీతో కలిసి చదువుకున్నారు. సెప్టెంబర్ 8న తన భార్యతో కలిసి మాజీ క్లాస్మేట్ అయిన ప్రధాని మోదీని ఆయన కలిశారు. మీరా-భయందర్లో దశాబ్దాలుగా ఉన్న భూమి వివాదంపై సీబీఐ విచారణ కోరారు. కాగా, 1989లో భయందర్ ఈస్ట్లోని నవ్గఢ్ రోడ్డులో ఉన్న 2,810 చదరపు మీటర్ల భూమిని తాను రిజిస్టర్డ్ ఒప్పందం ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు వోహ్రా తెలిపారు. ఆ భూమిని తాను ఎప్పుడూ అమ్మలేదు లేదా బదిలీ చేయలేదని చెప్పారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాకు అనుబంధంగా ఉన్న బిల్డర్లు నకిలీ పత్రాలతో తన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. 2011లో స్వయం బిల్డర్స్తో కుమ్మక్కై నకిలీ పత్రాలు తయారు చేశారని, ఆ తర్వాత తన ప్రమేయం లేకుండా ఆస్తిని రెండు భాగాలుగా విభజించారని ఆయన ఆరోపించారు. అయితే తన భూమిలోని ఒక భాగం స్వయం బిల్డర్స్ స్వాధీనంలో ఉండగా, బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మోహతాతో సంబంధాలున్న సెవెన్ ఎలెవెన్ కన్స్ట్రక్షన్స్ నియంత్రణలో మరో భాగం ఉన్నదని వోహ్రా తెలిపారు. తనకు యాజమాన్యపు హక్కులు ఉన్నప్పటికీ, మీరా-భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం వివాదాస్పద భూమిపై నిర్మాణ అనుమతి మంజూరు చేసిందని ఆయన ఆరోపించారు. పత్రాలను తారుమారు చేయడంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ శాఖ, స్థానిక పోలీస్ అధికారులు విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు 2015లో జరిగిన నకిలీ పత్రాల ఆరోపణలకు సంబంధించి తాను ఎఫ్ఐఆర్ దాఖలు చేయగా ఆ విషయం కోర్టుకు చేరిందని వోహ్రా తెలిపారు. అయితే కేసు నమోదైన దాదాపు 11 సంవత్సరాల తర్వాత, అంటే ఈ ఏడాదిలో ఆ కేసుపై సీఐడీ నివేదిక సమర్పించిందని చెప్పారు. రాజకీయ ఒత్తిడితో అధికారులు వ్యవహరించడం వల్ల ఈ ఆలస్యం జరిగిందని పేర్కొన్నారు. అలాగే తనకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా లేదా తన వాదన వినిపించే అవకాశం కల్పించకుండా 2025లో తనపై ఎదురు కేసు దాఖలు చేశారని వోహ్రా ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ప్రధాని మోదీని ఆయన కోరారు. వివరాలతో కూడిన ఒక లేఖను ఆయనకు సమర్పించారు. కాగా, ప్రధాని మోదీతో ఆయన మాజీ క్లాస్మేట్ వోహ్రా సమావేశం తర్వాత స్థానిక మున్సిపల్ అధికారులు ఈ భూ వివాదంపై స్పందించారు. సెప్టెంబర్ 16న విచారణకు షెడ్యూల్ చేశారు. స్వయం బిల్డర్స్, సెవెన్ ఎలెవెన్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు హాజరు కావాలని ఆదేశించారు.





