
CM Vijay : తమిళనాడు సీఎం విజయ్ ప్రస్తుతం లండన్లో పర్యటిస్తున్నారు. విజయ్ పర్యటన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసమే అంటూ ఆయన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అక్కడ ఆయన పర్యటన తీరుపై తమిళనాడు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఆయన పర్యటనను ప్రతిపక్షాలైన బీజేపీ, ఏఐఏడీఎంకే పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. విజయ్ నాలుగు రోజులపాటు లండన్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. రెండు రోజుల క్రితం సిల్వర్స్టోన్లో జరిగిన కార్ రేసింగ్లో పాల్గొన్నారు. నటుడు అజిత్ను కలిశారు. కార్ రేసింగ్ను దగ్గరుండి చూశారు. విజయ్తోపాటు నటి త్రిష కూడా ఉన్నారు. అయితే, పెట్టుబడుల కోసం వెళ్లిన విజయ్ ఏం పెట్టుబడులు తెస్తున్నారంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. విజయ్ వ్యక్తిగత పర్యటనలో ఉన్నారా.. లేక పెట్టుబడుల కోసమే లండన్ వెళ్లారా అనేది స్పష్టతనివ్వాలని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కోరారు. విజయ్ వ్యక్తిగత పర్యటనే అయితే, తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అలాకాకుండా ప్రజాధనంతో అక్కడ పర్యటిస్తూ, నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఇదే అంశంపై అసెంబ్లీ ప్రతిపక్ష డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కూడా స్పందించారు. విజయ్ లాంటి అనాగకరిక సీఎంను తమిళనాడు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి కూడా విజయ్పై విమర్శలు గుప్పించారు. విజయ్ లండన్ పర్యటనను సేద తీరడానికి వెళ్లిన విహార యాత్రగా అభివర్ణించారు. విజయ్ పర్యటన లక్ష్యం ఏంటో చెప్పాలని, ఆయన అక్కడ పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు లేదన్నారు. మలేసియా ప్రధాని తమిళనాడు రాజధాని చెన్నై వస్తుంటే.. సీఎం లండన్లో బిజీగా ఉన్నారని విమర్శించారు. అయితే, విజయ్ పెట్టుబడిదారులను కలిసి చర్చిస్తారని ఆయన సన్నిహితవర్గాలు అంటున్నాయి.





