
ప్రపంచం ఎదురుచూసిన సందర్భం రానే వచ్చింది. అందరి అంచనాలకు మించి అద్భుతమైన దౌత్య విజయాన్ని భారత్ తన ఖాతాలో వేసుకుంది. 11 పూర్తిస్థాయి సభ్య దేశాలు.. 10 భాగస్వామ్య దేశాలు.. మొత్తంగా 21 దేశాలు పాల్గొన్న బ్రిక్స్ 2026 సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ ఏడాది ఢిల్లీ వేదికగా భారత్ ఈ సదస్సుకు అతిధ్యాన్ని ఇచ్చింది. వచ్చే ఏడాది చైనా వేదికగా ఈ సదస్సు జరగనుంది. వైరుధ్యమైన దేశాల నడుమ.. ఏకాభిప్రాయాన్ని తీసుకురావటం అంత తేలికైన విషయం కాదు. అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటూ.. అదే సమయంలో చైనా లాంటి పొరుగుదేశాన్ని డీల్ చేయటం.. ఆహ్లాదవాతావరణంలో కార్యక్రమాన్ని పూర్తి చేయటం ఒక ఎత్తు అయితే.. అమెరికా మిత్రుడు కన్నెర్ర చేయకుండా జాగ్రత్తలు తీసుకోవటం కత్తి మీద సామే అవుతుంది.
ఓవైపు అమెరికా - ఇరాన్ యుద్ధం జరుగుతున్న వేళ.. ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ సదస్సుకు హాజరయ్యారు. మరోవైపు ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు.. భారత్ కు సహజ మిత్రుడు పుతిన్ కూడా హాజరయ్యారు. అంటే.. యుద్ధాలు చేస్తున్న రెండు దేశాలకు చెందిన అధ్యక్షులు ఒక సదస్సుకు రావటం.. వారు అమెరికాకు శత్రువులుగా ఉండటం.. వారికి అతిధ్యమిచ్చిన భారత్ అగ్రరాజ్యానికి మిత్రుడిగా ఉండటం లాంటి పరిణామాల్ని చూస్తే.. ఈ సదస్సు నిర్వహణ.. విజయవంతంగా పూర్తి చేయటం సర్కస్ విన్యాసానికి ఏ మాత్రం తీసిపోదని చెప్పాలి.
బ్రిక్స్ సదస్సులో అత్యంత కీలకమైన డిక్లరేషన్ కు అందరి ఆమోదం పొందటం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. బ్రిక్స్ లోని అన్ని దేశాలు ఏకాభిప్రాయంతో ఆమోదించిన ఈ డిక్లరేషన్ ను ఢిల్లీ డిక్లరేషన్ గా వ్యవహరించనున్నారు. మొత్తం 45 పేజీల్లో 140 పేరాల్లో ఉన్న ఈ విస్త్రత ప్రకటనకు సభ్య దేశాలన్నీ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆమోదించాయి. ఇంతకూ 140 పేరాల్లోని అంశాలేంటి? అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఈ మొత్తం 140 పేరాల్ని కుదించి.. అంశాల వారీగా చూస్తే మొత్తం పది అంశాలుగా కనిపిస్తాయి. ఇది మన వెసులుబాటు కోసం చేసుకుంటున్న విభజన అన్నది మర్చిపోకూడదు.
1. ప్రపంచ పాలన సంస్కరణలు (ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి, ప్రపంచ దక్షిణానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలి)
2. శాంతి, భద్రత, ఉగ్రవాదం (ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, సంఘర్షణల పరిష్కారం, సౌర్వభమత్వం)
3. ఆర్థిక వ్యవస్థ.. ప్రపంచ ఆర్థిక సంస్థలు (ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సంస్కరణలు)
4. వాణిజ్యం.. పెట్టుబడులు (ఏకపక్ష సుంకాలు.. వాణిజ్య అడ్డంకులు.. సప్లై చైన్.. పరస్పర పెట్టుబడులు)
5. సాంకేతిక.. ఏఐ (కృత్రిమ మేధస్సు.. డిజిటల్ పరివర్తన.. సాంకేతిక అంతరాన్ని తగ్గించటం)
6. ఇంధనం.. వాతావరణ మార్పు (ఇంధన భద్రత.. పునరుత్పాదక ఇంధనం.. వాతావరణ ఆర్థిక సాయం)
7. ఆరోగ్యం.. ఆహార భద్రత (ఆరోగ్య సహకారం.. మహమ్మారుల సన్నద్ధత.. ఆహార భద్రత)
8. అభివృద్ధి.. సామాజిక సంక్షేమం (పేదరికం.. ఉపాధి.. మహిళలు.. యువత.. విద్య)
9. ప్రజల మధ్య సంబంధాలు (టూరిజం.. కల్చర్.. క్రీడలు.. విద్యార్థుల మార్పిడి)
10. బ్రిక్స్ సంస్థాగత నిర్మాణం (కొత్త సభ్యులు.. బ్రిక్స్ వ్యవస్థను బలోపేతం చేయటం.. నిరంతర సహకారం)
ఇప్పుడున్న పరిస్థితుల్లో భిన్నధ్రువాలుగా ఉండే దేశాలు ఒక తాటి మీదకు రావటం.. కొన్ని అంశాల మీద ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లటం మామూలు విషయం కాదు. మొత్తం 140 పేరాల్లో 139, 140 పేరాల్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఎందుకంటే.. 139వ పాయింట్ లో బ్రిక్స్ కు భారత ఛైర్మన్ షిప్ ను అందరూ ప్రశంసిస్తే.. 140 పేరాలో 2027లో బ్రిక్స్ ఛైర్మన్ షిప్ ను చైనాకు అప్పగించేందుకు అందరూ మద్దతు ఇవ్వటం. తాజా సమ్మిట్ లో అందరూ ఒప్పుకునేలా డిక్లరేషన్ చేయటం అంత తేలికైన విషయం కాదు.
ఇక్కడే భారత దౌత్యవేత్తల చతురత కనిపిస్తుంది. అదెలా అంటే.. వేదిక మీద ఉన్న భారత్, చైనా, రష్యా, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, బ్రెజిల్, ఇండోనేషియా, ఈజిప్టు, ఇథోపియా, సౌతాఫ్రికా దేశాల వ్యూహాలు.. వ్యూహాత్మక ప్రయోజనాలు భిన్నమైనవన్నది మర్చిపోకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ కు యూఏఈకి అస్సలు పడదు. భారత్ - చైనా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి ప్రయోజనాలు వేరు. భారత్ - రష్యా దేశాల మధ్య సహజ మిత్రత్వం ఉన్నప్పటికి.. మధ్యలో అమెరికా పాత్రను విస్మరించలేం. ఇలా భిన్న ధ్రువాలు ఉన్నప్పటికి ఏకాభిప్రాయానికి రావటమే ఆసక్తికర అంశం.





