
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి ధర్మవరం వాసుల షాక్‌ ఈనాడు, పుట్టపర్తి: ధర్మవరం పట్టణంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుడ్‌ మార్నింగ్‌ ధర్మవరం కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న ఆయనకు ప్రజల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రజల్లోకి వెళ్తున్న ఆయనకు క్షేత్రస్థాయిలో గత ప్రభుత్వ పాలనపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇటీవల ధర్మవరం పట్టణంలోని పలు వీధుల్లో పర్యటించిన కేతిరెడ్డి.. అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్న నిరుపేదలను పలుకరించారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి ‘‘అద్దె ఇంట్లో ఎందుకు ఉంటున్నారు? గత వైకాపా ప్రభుత్వంలో ఇళ్లు ఇవ్వలేదా? అంటూ ప్రశ్నించారు. అయితే ఆయన అంచనాలకు పూర్తి భిన్నంగా ప్రజల నుంచి వచ్చిన సమాధానాలు మాజీ ఎమ్మెల్యేను ఒక్కసారిగా కంగు తినిపించాయి. గత ప్రభుత్వ హయాంలో తమకు ఎలాంటి ఇళ్లు రాలేదని పలువురు కుండబద్దలు కొట్టినట్లు సమాధానం చెప్పారు. కేవలం ఒకరిద్దరు కాకుండా.. చాలా ఇళ్ల వద్ద మాజీ ఎమ్మెల్యేకు ఇదే తరహా అనుభవం ఎదురు కావటం గమనార్హం. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలోనే ప్రజల నుంచి ఇలాంటి స్పందన రావడంతో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సమాధానం చెప్పుకోలేక వెనుతిరుగుతున్నారని తెదేపా నాయకులు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్‌ చేసి ట్రోల్‌ చేస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.