
Allahabad High Court Directs Father And State To Pay 25 Lakh Rupees To Two Sisters Confined For Converting To Islam
Allahabad High Court Religion Verdict : వయోజనులైన పౌరులకు తమకు నచ్చిన మతాన్ని ఎంచుకునే పరిపూర్ణ హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.
Allahabad High Court Religion Verdict : వయోజనులైన పౌరులకు తమకు నచ్చిన మతాన్ని ఎంచుకునే పరిపూర్ణ హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇస్లాం మతాన్ని స్వీకరిస్తున్నారనే నెపంతో మేజర్లు అయిన ఇద్దరు కుమార్తెలను ఇంట్లోనే అక్రమంగా బంధించిన ఒక తండ్రి చర్యను న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ప్రవర్తించిన సదరు తండ్రితో పాటు బాధితుల హక్కులను కాపాడటంలో విఫలమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు భారీ జరిమానా విధించింది. బాధితులైన ఇద్దరు యువతులకు కలిపి రూ. 25 లక్షల భారీ పరిహారాన్ని తండ్రి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చెల్లించాలని ఆదేశిస్తూ జస్టిస్ సందీప్ జైన్ సంచలన తీర్పు వెలువరించారు.అసలేం జరిగిందంటే..?తన కుమార్తెలైన దియా భాటియా అలియాస్ జోయా దియా భాటియా (20), అన్షు భాటియా అలియాస్ అమీనా అన్షు భాటియా (35)లను ప్రలోభాలకు గురిచేసి.. బెదిరించి మతం మార్చారంటూ వారి తండ్రి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నెపంతోనే ఆయన వారిని ఇంట్లోనే నిర్బంధించారు. అయితే తమను అక్రమ నిర్బంధం నుంచి విడిపించాలని కోరుతూ బాధిత యువతులు ఇద్దరూ అలహాబాద్ హైకోర్టులో 'హెబియస్ కార్పస్' పిటిషన్ను దాఖలు చేశారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ సందీప్ జైన్ నేరుగా బాధిత యువతులతో మాట్లాడారు. వారు ఎవరి ఒత్తిడికీ లొంగలేదని, స్వచ్ఛందంగానే మతం మారాలని నిర్ణయించుకున్నారని నిర్ధారించుకున్నారు. దీంతో తండ్రి చేసిన బెదిరింపులు, ప్రలోభాల ఆరోపణలను న్యాయస్థానం పూర్తిగా కొట్టివేసింది.ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహంఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుల వాదనను పట్టించుకోకుండా కేవలం తండ్రి చేసిన ఆరోపణలనే ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆక్షేపించింది. చట్టబద్ధంగా మేజర్లు అయిన యువతులను అక్రమ నిర్బంధం నుంచి విడిపించడంలోనూ.. వారి వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడటంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తింది.రూ. 25 లక్షల భారీ పరిహారం చెల్లింపునకు ఆదేశంస్వేచ్ఛాయుత జీవన హక్కును భంగపరిచినందుకు గాను తండ్రి, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరూ బాధ్యత వహించాలని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. బాధితులకు చెల్లించాల్సిన రూ. 25 లక్షల పరిహారంలో సగం మొత్తం తండ్రి, మిగిలిన సగం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని తీర్పులో పేర్కొంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది.





