
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి మరోసారి నిరాశ ఎదురైంది. గాయాల కారణంగా పలువురు ఆటగాళ్లు జట్టుకు దూరమవుతున్నా.. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలు మొదలైనప్పటికీ.. షమీ పేరు సెలెక్షన్ చర్చల్లో కనిపించడం లేదు. ఈ పరిస్థితిపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ స్పందించాడు. జట్టులోకి రావాలనుకుంటే షమీ తన చేతిలో ఉన్న పనిపైనే దృష్టి పెట్టాలని సూచించాడు.‘‘ముందుకు ఎలా వెళ్లాలనేది షమీ నిర్ణయమే. మ్యాచ్లు ఆడుతూ బాగా రాణిస్తే జాతీయ జట్టుకు అందుబాటులో ఉన్నట్టే. ప్రస్తుతం జట్టు ఆలోచన మరోలా ఉండొచ్చు. కానీ ఆటగాడిగా మన ఆలోచన, మనం జట్టుకు ఎలా ఉపయోగపడగలమన్నది ముఖ్యం. షమీ ఇప్పుడు చేస్తున్నదే కొనసాగించాలి. మ్యాచ్లు ఆడటం, రాణించడం చాలా ముఖ్యం’’ అని జహీర్ చెప్పాడు.టీమిండియాలో పెరుగుతున్న గాయాలపైనా జహీర్ స్పందించాడు. జస్ప్రీత్ బుమ్రా వరుస సిరీస్లకు ఫిట్గా ఉండలేకపోతుండగా.. వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య వంటి ఆటగాళ్లు కూడా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే గాయాలు ఆటలో భాగమేనని జహీర్ అన్నాడు.ఆటగాళ్ల పని భారం తగ్గించడం అవసరమే అయినా.. పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ గాయపడినప్పుడు తన చేతిలో ఉన్న విషయాలపై నియంత్రణ సాధించడం చాలా ముఖ్యమని చెప్పాడు. గాయానికి అసలు కారణం ఏంటో తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని సూచించాడు