
న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్ షట్లర్ పీవీ సింధు, యువ సంచలనం ఆయుష్ శెట్టి ప్రీక్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లగా, మేటి ఆటగాడు లక్ష్యసేన్ అనూహ్య ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో పీవీ సింధు అద్భుత ప్రదర్శన కనబరిచింది. కెనడాకు చెందిన వెన్ యు జాంగ్ను 21-16, 21-17 తేడాతో కేవలం 35 నిమిషాల్లోనే ఓడించి విజయం సాధించింది. తొలి గేమ్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు, రెండో గేమ్లో ఒక దశలో 9-12తో వెనుకబడినప్పటికీ.. వెంటనే పుంజుకుని మ్యాచ్ను కైవసం చేసుకుంది.అయితే, పురుషుల సింగిల్స్లో భారత శిబిరానికి నిరాశ ఎదురైంది. అమెరికా ఆటగాడు గారెట్ టాన్తో జరిగిన హోరాహోరీ పోరులో లక్ష్యసేన్ 21-19, 19-21, 17-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. గంటా 13 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్ గెలిచినప్పటికీ, లక్ష్యసేన్ ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయాడు.మరోవైపు, యువ ఆటగాడు ఆయుష్ శెట్టి తన విజయయాత్రను కొనసాగిస్తున్నాడు. శ్రీలంక ఆటగాడు దుమిందు అబేవిక్రమను 21-8, 21-10 తేడాతో కేవలం 26 నిమిషాల్లోనే చిత్తుచేసి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించాడు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీకి వాకోవర్ లభించగా, మిక్స్డ్ డబుల్స్లో తనీషా క్రాస్టో-ధ్రువ్ కపిల జోడీ మూడో రౌండ్కు చేరుకుంది. ఇక మహిళల సింగిల్స్లో ఉన్నతి హుడా ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది