© 2026 nimisham.in

ఉద్యోగులకు ఇచ్చిన ఆఫీసు ల్యాప్టాప్లలో టీసీఎస్ ప్రత్యేక మానిటరింగ్ సాఫ్ట్వేర్ను అమర్చినట్లు సమాచారం. ఉద్యోగులు ఏయే అప్లికేషన్లు వాడుతున్నారు? వాటిపై ఎంత సమయం గడుపుతున్నారు? వంటి వివరాలను ఈ టూల్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని మనీకంట్రోల్ తన కథనంలో పేర్కొంది.ఈ సాఫ్ట్వేర్ను ‘డిజిటల్ యూజర్ ఎక్స్పీరియన్స్ మానిటరింగ్ టూల్’గా అభివర్ణిస్తున్నారు. కంపెనీ ల్యాప్టాప్లలో జరిగే కార్యకలాపాలపై ఎక్కువ సమాచారం పొందేందుకు దీనిని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై టీసీఎస్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.సంస్థకు చెందిన రహస్య సమాచారం బయటకు వెళ్లకుండా అడ్డుకోవడం, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడం, సైబర్ భద్రతను పెంచడం వంటి అవసరాల కోసం ఇలాంటి టూల్స్ను కంపెనీలు వాడుతుంటాయి. అదే సమయంలో ఉద్యోగుల వ్యక్తిగత గోప్యతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.టీసీఎస్ ఏ సాఫ్ట్వేర్ను వాడుతోందన్న విషయం ఇంకా బయటకు రాలేదు. ఏయే వివరాలను సేకరిస్తోంది? ఆ సమాచారాన్ని ఎవరు చూడగలరు? ఈ నిఘా ఎంత వరకు ఉంటుందన్న అంశాలపై స్పష్టత లేదు.ఉద్యోగులపై డిజిటల్ నిఘా ఐటీ రంగంలో కొత్త విషయం కాదు. ఇటీవల మెటా కూడా ఉద్యోగుల కంప్యూటర్ వినియోగం, కీబోర్డ్ స్ట్రోక్స్, మౌస్ కదలికలను నమోదు చేసే వ్యవస్థపై విమర్శలు ఎదుర్కొంది. తీవ్ర వ్యతిరేకత రావడంతో డేటా సేకరణను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం కల్పించింది.ఇలాంటి వ్యవస్థలు కంపెనీ భద్రతకు ఉపయోగపడతాయా? లేక ఉద్యోగుల వ్యక్తిగత స్వేచ్ఛపై నిఘా పెంచుతాయా? అన్న చర్చ ఇప్పుడు మరోసారి మొదలైంది
.