
విజయనగరం రూరల్‌: జిల్లా కేంద్రమైన విజయనగరంలోని వసంతవిహార్ వద్ద గురువారం కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ‘స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా తానే పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2 వరకు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, పాఠశాలలు, పర్యాటక ప్రదేశాలు, కాలనీలతోపాటు పలు చోట్ల స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ, మండల, పురపాలక సంఘాలు వారీగా ముందుగానే షెడ్యూల్ తయారు చేశామని వివరించారు. ప్రభుత్వ యంత్రాంగంతోపాటు, ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత, మహిళలు స్వచ్ఛతా ఉద్యమంలో భాగస్వాములై, వారానికోసారి తమ ప్రాంతాలను శుభ్రం చేసే కార్యక్రమంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామన్నారు. చెత్తను ఆరుబయట, కాలువల్లో, నీటికుంటలు, చెరువుల్లో వేయవద్దని సూచించారు. చెత్తబుట్టలో ఉంచి తమ ఇంటికి వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలన్నారు. అదేవిధంగా పాత వస్తువుల పునర్వినియోగంపై అవగాహన కల్పించి, రీసైక్లింగ్ చేయాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, ఇంజినీర్ ప్రసాద్, ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.