© 2026 nimisham.in
TN Assembly Anti NEET Resolution : దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'నీట్' ప్రవేశ పరీక్షపై తమిళనాడు ప్రభుత్వం మరోసారి తీవ్ర నిరసన స్వరం వినిపించింది. జాతీయ స్థాయి నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో సంచలన తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె. అరుణ్రాజ్ మంగళవారం ఈ ప్రతిపాదిత తీర్మానాన్ని సభ ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ తీర్మానానికి ప్రధాన ప్రతిపక్షాలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలతో పాటు టీవీకే మిత్రపక్షాలు సైతం పరిపూర్ణ మద్దతు ప్రకటించాయి. అయితే ఈ అంశంపై నిరసన తెలుపుతూ భారతీయ జనతా పార్టీ సభ్యులు మాత్రం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం గమనార్హం.కోచింగ్ సెంటర్ల వ్యాపారీకరణ.. పేద విద్యార్థులకు అన్యాయం!అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి కె. అరుణ్రాజ్ ప్రసంగిస్తూ నీట్ విధానం వల్ల కలుగుతున్న నష్టాలను ఎండగట్టారు. నీట్ పరీక్ష ప్రవేశ పెట్టిన నాటి నుంచి విద్యార్థుల దృష్టంతా సాధారణ చదువుల నుంచి ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల వైపు మళ్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతంగా ఫీజులు వసూలు చేసే కోచింగ్ సంస్థలు గల్లీ గల్లీకీ పెరిగిపోయాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితి వల్ల గ్రామీణ ప్రాంతాలకు చెందిన, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు వైద్య విద్య అవకాశాలను తీవ్రంగా కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. నీట్ విధానం అనేది సామాజిక న్యాయం, సమానత్వం, రాష్ట్రాల రాజ్యాంగబద్ధ హక్కులకు సంపూర్ణంగా వ్యతిరేకమని.. ఈ విషయంలో తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే వైఖరితో పోరాడుతోందని మంత్రి గుర్తుచేశారు.ప్లస్ టు మార్కుల ఆధారంగానే మెడికల్ సీట్లు!రాష్ట్రంలోని విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు 12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గతంలో పాలించిన డీఎంకే
ప్రభుత్వం కూడా ఇదే డిమాండ్ను బలంగా వినిపించిందని సభలో ప్రస్తావించారు.పేపర్ లీకేజీలు, ఒత్తిడి వల్ల విద్యార్థుల ఆత్మహత్యలు!సభ ఆమోదించిన తీర్మానంలో ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించింది. నీట్ పరీక్ష తెస్తున్న తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆత్మహత్యల పరంపరకు స్వస్తి పలకాలన్నా, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలన్నా కేంద్ర ప్రభుత్వం తక్షణమే నీట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడమే ఏకైక మార్గమని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేసింది.