
ఇంటర్నెట్ డెస్క్: విమానం (Vietnam flight)లో ఒకేసారి పలు సాంకేతిక సమస్యలు చోటుచేసుకోవడంతో రెండు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన జర్మనీలోని మ్యూనిచ్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వియత్నాం ఎయిర్లైన్స్ విమానం మ్యూనిచ్ నుంచి వియత్నాంలోని హనోయి నగరానికి బయలుదేరాల్సి ఉంది. టేకాఫ్ అవుతున్న సమయంలో సాంకేతిక సమస్య (Technical Issue) తలెత్తడంతో విమానం రెండుసార్లు వేగం తగ్గింది. అనంతరం వెనుక భాగం బలంగా నేలను తాకి టేకాఫ్ అయ్యింది. దీంతో వెనుకవైపు నాలుగు ప్రధాన ల్యాండింగ్ గేర్ టైర్లు పేలిపోయాయి. ఈ సమయంలో ల్యాండ్ చేస్తే ప్రమాదం సంభవించే అవకాశం ఉండడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. విమానంలోని ఇంధనాన్ని ఖాళీ చేయడానికి గాల్లో రెండు గంటల పాటు చక్కర్లు కొట్టారు. ఇంధనం ఖాళీ అయిన అనంతరం సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే ల్యాండ్ చేసే సమయంలోనూ పేలిన టైర్లు నేలకు రాసుకుపోవడంతో విమానం రన్వేపైనే నిలిచిపోయింది. దీంతో రన్వేను తాత్కాలికంగా మూసేశారు. ఘటన సమయంలో విమానంలో 271 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు. వెంటనే ప్రయాణికులను సురక్షితంగా దించేసి, మరో విమానంలో గమ్యస్థానాలకు చేర్చారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎయిర్లైన్స్ వెల్లడించింది. ఇదీ చదవండి: బంగారు గని కూలి.. 30 మంది దుర్మరణం గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు