
ఇంటర్నెట్ డెస్క్: నీట్ (NEET) పరీక్షల నిర్వహణ కోసం సరికొత్తగా తీసుకువచ్చిన భద్రతా నిబంధనలు అత్యంత పకడ్బందీగా ఉన్నాయని కేంద్రం సుప్రీం కోర్టు (Supreme Court)కు వెల్లడించింది. దానిని ఛేదించడం కష్టమని పేర్కొంది. ‘పలువురు నిపుణులు కలిసి క్వశ్చన్ బ్యాంకును తయారు చేస్తారు. అందులో నుంచి పరీక్షలో ఏ ప్రశ్నలు వస్తాయనే విషయం వారికి కూడా తెలియదు. నీట్ ప్రశ్నపత్రాల (Question Papers)ను రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థలు అమర్చాం. ఇవి వాహనంలోని చిన్న కదలికలను కూడా రికార్డ్ చేస్తాయి. దీనివల్ల రవాణా సమయంలో అధికారులు పర్యవేక్షించగలుగుతారు’ అని కేంద్రం వెల్లడించింది. పేపర్ లీక్లు అనేవి వ్యవస్థాగత సమస్య అని.. వాటిని నివారించడానికి సంస్థాగత మార్పులు అవసరమని రాధాకృష్ణన్ కమిటీ చెప్పిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వారు చెప్పింది అక్షరసత్యమని పేర్కొంది. నీట్ పరీక్ష సంస్కరణలపై రాధాకృష్ణన్ ప్యానెల్, నందన్ నీలేకని కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి ఏం చర్యలు తీసుకున్నారని జాతీయ పరీక్షల సంస్థ (NTA)ను ప్రశ్నించింది. వాటిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల్లో అవకతవకలు బయటపడుతున్న నేపథ్యంలో పరీక్షల వ్యవస్థ సమూల ప్రక్షాళనకు జాతీయ పరీక్షల సంస్థ (NTA) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే 50మందికిపైగా సిబ్బందిని తొలగించింది. సైబర్ భద్రత, సైకోమెట్రిక్స్, ప్రశ్నపత్రాల రూపకల్పన, ఇతర ప్రత్యేక విభాగాల కోసం ప్రైవేట్ రంగం నుంచి కూడా నిపుణులను తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ప్రశ్నపత్రాల గోప్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక గదులు, ఎయిర్-గ్యాప్డ్ సిస్టమ్స్ (ఇంటర్నెట్తో సంబంధం లేని వ్యవస్థలు), పరికరాలను భద్రపరిచే విధానాలను పూర్తిగా పునర్ వ్యవస్థీకరిస్తున్నట్లు తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి