హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కోకాపేట నియోపొలిస్ భూముల వేలంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వేలంలో రికార్డు స్థాయిలో భారీ బిడ్ వేసి ప్లాట్ను దక్కించుకున్న వజ్రా కన్స్ట్రక్షన్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ నిర్ణీత గడువులోగా నిధులు చెల్లించలేక చేతులెత్తేసింది. దీంతో వేలం నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ.. హెచ్ఎండీఏ సదరు నిర్మాణ సంస్థ భద్రతా డిపాజిట్గా చెల్లించిన రూ. 5 కోట్ల అర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD)ని జప్తు చేసింది.కోకాపేట ప్లాట్ నంబర్ 17లోని 4.59 ఎకరాల భూమికి వజ్రా కన్స్ట్రక్షన్స్ ఎకరాకు ఏకంగా రూ. 136.50 కోట్ల చొప్పున బిడ్ దాఖలు చేసి భూములు దక్కించుకుంది. ఈ లెక్కన ఆ భూమి మొత్తం విలువ రూ. 626 కోట్లకు పైగానే ఉంటుంది. అయితే, భూమి కొనుగోలుకు అవసరమైన పూర్తి ఆర్థిక ఇన్వెస్ట్మెంట్ సొంతంగా లేనప్పటికీ.. ప్రాజెక్టు ప్రకటించి ప్రీ-లాంచ్, ఓపెన్ టు పబ్లిక్ విక్రయాల ద్వారా కొనుగోలుదారుల నుంచి ముందస్తుగా నిధులు సమీకరించి ప్రభుత్వానికి చెల్లించవచ్చని ఆ సంస్థ భావించింది. అయితే మార్కెట్లో ఆశించిన స్థాయిలో ప్రీ-లాంచ్ విక్రయాలు జరగకపోవడంతో ఆ వ్యూహం ఫలించలేదు.నిర్ణీత గడువు ముగిసినా డబ్బులు చెల్లించకపోవటంతో రూ. 5 కోట్ల డిపాజిట్ను హెచ్ఎండీఐ జప్తు చేసింది. ఫలితంగా వజ్రా కన్స్ట్రక్షన్స్ రూ. 600 కోట్లకు పైగా విలువైన కోకాపేట స్థలంతో పాటు రూ. 5 కోట్ల నగదును కోల్పోయి రెండు రకాలుగా నష్టాన్ని మూటగట్టుకుంది. భవిష్యత్ ప్రాజెక్టు విక్రయాలను నమ్ముకొని ఆర్థిక సామర్థ్యానికి మించి బిడ్లు వేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టం చేస్తోందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. చెల్లింపులు జరగని నేపథ్యంలో ప్లాట్ నంబర్ 17 కింద ఉన్న 4.59 ఎకరాల స్థలానికి త్వరలోనే మళ్లీ పారదర్శకంగా బహిరంగ వేలం నిర్వహించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. గత వేలంలో ఎకరాకు 136.50 కోట్ల కోట్లకు పైగా