
ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక వెలువరించింది. సముద్ర మట్టాల పెరుగుదలతో ముంబై, కోల్కతాలకు పెను ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ఆయా నగరాల్లోని లక్షలాదిమంది నిరాశ్రయులయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 1: సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతుండటంతో భారత్లోని కోల్కతా, ముంబై నగరాలతో పాటు దక్షిణాసియాలోని దాదాపు 1.4 కోట్లకు పైగా ప్రజలు తమ ఇళ్లను, నివాసాలను కోల్పోయే తీవ్ర ప్రమాదంలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి (UN) హెచ్చరించింది. ఐరాస సెక్రటరీ జనరల్ సమర్పించిన 'సముద్ర మట్టాల పెరుగుదల - ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు' అనే నివేదికలో ఈ దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు. తీవ్రమవుతున్న ముప్పు: మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న గ్లోబల్ వార్మింగ్, గ్లేసియర్లు కరగడం, మహాసముద్రాలు వేడెక్కడం వల్ల చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని ఐరాస స్పష్టం చేసింది. 1.4 కోట్ల మంది ఇళ్లకి ముప్పు: దక్షిణాసియాలోని లోతట్టు డెల్టా ప్రాంతాలైన కోల్కతా, ముంబై, ఢాకా వంటి నగరాల్లో సముద్ర జలాలు ముంచెత్తడం వల్ల దాదాపు 1.4 కోట్ల మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. ప్రపంచ జనాభాపై ప్రభావం: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 77 కోట్లకు పైగా ప్రజలు (మొత్తం జనాభాలో 10 శాతం) సముద్ర మట్టానికి 5 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న తీరప్రాంతాల్లో నివసిస్తూ ప్రమాదంలో ఉన్నారని నివేదిక పేర్కొంది. మౌలిక సదుపాయాలు, ఆర్థిక నష్టం: పెరిగే సముద్ర మట్టాల వల్ల తాగునీటి వనరులు ఉప్పునీరుగా మారడం, మౌలిక సదుపాయాలు, విద్యుత్ వ్యవస్థలు, రోడ్డు రవాణా, వ్యవసాయం దెబ్బతినడమే కాకుండా తీరప్రాంత ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంది. రికార్డు స్థాయిలో సముద్ర మట్టాల పెరుగుదల: 2014 నుంచి 2023 మధ్య కాలంలో ఏటా సగటున 4.7 మిమీ చొప్పున పెరిగిన సముద్ర మట్టం, 2024 లో ఏకంగా 5.9 మి.మీ పెరిగి నూతన రికార్డును నమోదు