
చైనా తూర్పు తీరాన్ని వణికిస్తున్న 'డాల్ఫిన్' టైఫూన్ ప్రభావం సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత రుతుపవనాలపై పడుతోంది. ఈ టైఫూన్ వల్ల దేశానికి ప్రత్యక్షంగా ఎటువంటి ముప్పు లేనప్పటికీ, దీని కారణంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు రుతుపవన వ్యవస్థను బలహీనపరుస్తున్నాయని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఈ ఏడాది చైనాను తాకిన అత్యంత శక్తిమంతమైన టైఫూన్గా డాల్ఫిన్ను వాతావరణ శాఖ గుర్తించింది. ఆగస్టు 9న జెజియాంగ్ ప్రావిన్స్లోని యుహువాన్ సమీపంలో గంటకు 151 కిలోమీటర్ల వేగంతో వీచిన పెను గాలులతో ఇది తీరాన్ని దాటింది. ఈ టైఫూన్ ధాటికి చైనా ప్రభుత్వం సుమారు పది లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించగా, పలు చోట్ల భారీ వర్షాలు, వరదలు సంభవించాయి.అయితే, ఈ టైఫూన్ ప్రభావం భారత్పై పరోక్షంగా పడుతోంది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో నెలకొన్న అలజడి, ఎల్ నినో తరహా పరిస్థితులు కారణంగా వాతావరణ కదలికలు తూర్పు వైపునకు మళ్లుతున్నాయి. ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలోని వాతావరణ స్థితిగతులను ప్రభావితం చేస్తోంది. ఫలితంగా, భారత రుతుపవనాలకు కీలకమైన బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణులు ఏర్పడకపోవడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి.డాల్ఫిన్ టైఫూన్ నేరుగా మన వర్షాలను నియంత్రిస్తోందని చెప్పలేమని, అయితే పసిఫిక్ సముద్రంలో చోటుచేసుకుంటున్న విస్తృత వాతావరణ మార్పులలో ఇది ఒక భాగమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడితేనే రుతుపవనాలు మళ్లీ పుంజుకుంటాయని, లేని పక్షంలో వర్షపాతంపై ప్రతికూల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు