
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయింపుల వివాదం ఇప్పుడు క్లైమాక్స్కు చేరింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు పడుతుందా లేదా అనే ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణను పూర్తి చేసి, తుది తీర్పును రిజర్వ్ చేసింది. అసెంబ్లీ స్పీకర్ గతంలో ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్లపై వెలువడనున్న తీర్పు, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికే అవకాశం ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన దానం నాగేందర్, ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఆయన పార్టీ మారలేదని గతంలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో రెండు వేర్వేరు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం దానం నాగేందర్ స్వచ్ఛందంగా తన ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకున్నట్లేనని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు కె. వివేక్ రెడ్డి, గండ్ర మోహన్ రావు ధర్మాసనం ముందు బలమైన వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే, కాంగ్రెస్ పార్టీ టికెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం, నామినేషన్ వేయడం, కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహించడం వంటి అంశాలు నేరుగా పార్టీని వీడినట్లే అవుతాయని స్పష్టం చేశారు. అధికారికంగా రాజీనామా లేఖ సమర్పించారా లేదా అనే దానితో సంబంధం లేకుండా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ప్రభుత్వం స్థిరత్వం లేదా పార్టీ బలం తగ్గడంపై అనర్హత చట్టం ఆధారపడదని కోర్టుకు నివేదించారు. ఈ సందర్భంగా హైకోర్టు కీలక స్పష్టతనిచ్చింది