
ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి (94) అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశానవాటికలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శనివారం ఉదయం నుంచి అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని నివాసంలో ఉంచి, మధ్యాహ్నం అనంతరం అంతిమ సంస్కారాలను పూర్తి చేయనున్నారు.వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1931 డిసెంబర్ 12న జన్మించిన ఆమె అసలు పేరు శంకరమంచి జానకి. 'షావుకారు' చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమెకు, ఆ సినిమా పేరే ఇంటిపేరుగా స్థిరపడిపోయింది.దాదాపు ఏడు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి ఆమె తనదైన ముద్ర వేశారు. జానకి మృతి పట్ల చిరంజీవి, కమల్ హాసన్, జూనియర్ ఎన్టీఆర్, విష్ణు మంచు వంటి పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమెకు ముగ్గురు సంతానం, నలుగురు మనుమలు, నలుగురు మునిమనుమలు ఉన్నారు
.