
తెలుగు రంగస్థలంపై తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు, రచయిత, దర్శకుడు యల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ, గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరు ఏటీ అగ్రహారంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు నాటకరంగంలో ఓ విశిష్ట అధ్యాయం ముగిసినట్లైంది. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణేశ్వరరావు కేవలం నటుడిగానే కాకుండా రచయితగా రంగస్థలానికి విశేష సేవలందించారు. ఆయన రాసిన, నటించిన ఎన్నో నాటకాలు తెలుగు రాష్ట్రాల్లోని పరిషత్ నాటక పోటీల్లో ప్రదర్శితమయ్యాయి. చిన్న వయసులోనే కళారంగంపై ఆసక్తి పెంచుకున్న కృష్ణేశ్వరరావు పాఠశాల రోజుల్లోనే నటుడిగా ప్రయాణం మొదలుపెట్టారు. ‘వాపస్’ ఆయన తొలి నాటకంగా నిలిచింది. ఆ తర్వాత రంగస్థలమే ఆయన జీవితంలో ప్రధాన భాగమైంది. ఏకంగా 1500కు పైగా నాటకాల్లో నటించడమే కాకుండా, ఎన్నో నాటకాలకు రచన కూడా చేశారు. ‘సంపద’, ‘రోజూ చస్తున్న మనిషి’, ‘పక్కింట్లో పుట్టండి’, ‘అధికారి’, ‘నష్ట పరిహారం’, ‘భూమి కోసం’, ‘గుర్తు తెలియని శవం’ వంటి నాటకాలతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తాను రచించిన నాటకాల్లోనే నటిస్తూ, వాటికి దర్శకత్వం వహించడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది. పొన్నూరు కళాపరిషత్ స్థాపనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రయోగాత్మక నాటకాలతో పలు అవార్డులు అందుకున్నారు. ‘కూతురి కోసం’ నాటకంలో నటనకు భారతముని అవార్డును కూడా అందుకున్నారు. రంగస్థలంపై ఆయన ప్రతిభను చూసిన సీనియర్ నటుడు ఎం. ప్రభాకర్రెడ్డి సినిమాల్లోకి పరిచయం చేశారు. కృష్ణేశ్వరరావు రాసిన ‘రోజూ చస్తున్న మనిషి’ నాటకాన్ని చూసిన ప్రభాకర్రెడ్డి, ‘ప్రచండ భారతం’ చిత్రానికి సంభాషణలు రాసే అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆయన సినీ రచయితగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ‘శ్రీరాములయ్య’, ‘భద్రాచలం’ చిత్రాలకు కథ అందించారు. జయం మనదేరా మూవీ రైటింగ్ టీంలో కూడా పనిచేశారు. ‘పరశురామ్’కు సంభాషణలు రాయగా, ‘నేను సైతం’ చిత్రానికి పాటలు