
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ స్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని కొమరం భీం విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతు..ఆదివాసుల చరిత్రంతా పోరాటాల చరిత్రే అని మంత్రి సీతక్క అన్నారు. హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆదివాసులు ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. సమ్మక్క–సారలమ్మ నుంచి బిర్సా ముండా, రాంజీ గోండు, కొమురం భీమ్ వరకు అనేక మంది ఆదివాసీ నాయకులు పోరాటాలు చేశారని గుర్తు చేశారు. వారి పోరాటాల్లో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. రాజ్యాంగం ఆదివాసులకు ప్రత్యేక హక్కులు కల్పించిందని.. ఐదో షెడ్యూల్ ద్వారా ప్రత్యేక రక్షణలు ఉన్నాయని సీతక్క తెలిపారు. అయితే వాటిని సక్రమంగా అమలు చేయకపోవడంతో ఆదివాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తమకు ఎవరిపైనా శత్రుత్వం లేదని.. ఏ ప్రాంత ప్రజలనూ వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం మాత్రమే పోరాడాలని ఆదివాసులకు పిలుపునిచ్చారు. అడవిపై హక్కులు, ఉద్యోగాలు, ఇళ్లపై హక్కులు తమ ప్రధాన డిమాండ్లని సీతక్క చెప్పారు. అధికారులు పేద ఆదివాసులను, ఇతరులను వేర్వేరుగా చూడకూడదని.. అందరినీ సమానంగా చూడాలని సీతక్క సూచించారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి, ప్రత్యేక నిధుల కోసం ఆరుగురు ఆదివాసీ ఎమ్మెల్యేలం కలిసి మంత్రులను కలుస్తున్నామని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదలు, ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని సీతక్క అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ ఇళ్లను కేటాయించిన ఘనత సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి దక్కుతుందని చెప్పారు. కొమురం భీమ్ ‘జల్, జంగల్, జమీన్’ కోసం పోరాడారని.. తెలంగాణ ఉద్యమంలో ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు.ఆదివాసులు తమ భాష, వేషధారణ, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని సీతక్క సూచించారు. ఇవే తమ అస్తిత్వానికి, గుర్తింపునకు ప్రతీకలని అన్నారు