© 2026 nimisham.in

Saikrishna Custodial Death Case : గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా పేర్కొంటున్న సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు సిట్ చేస్తున్న ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ, సిఐ నాగరాజు కస్టడీ అంశంపై సిట్ బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు విధించిన నిబంధనలను సడలించాలని సిట్ కోరింది. ఈకేసులో వాస్తవానికి నేటి నుంచి సిఐ నాగరాజును కస్టడీకి తీసుకుని సిట్ బృందం ఎనిమిది రోజుల పాటు విచారించాల్సి ఉంది. అయితే.. సిట్ తనను ఇరికించేందుకు కుట్ర చేస్తోందని, ఇందులో భాగంగానే కస్టడీకి కోరిందని.. విచారణ పేరిట తనను టార్చర్ చేయకుండా రక్షణ కల్పించాలని నాగరాజు న్యాయస్థానాన్ని లేఖ రాయడంతో కేసు కీలక మలుపు తిరిగినట్లైంది. సీఐ నాగరాజు కస్టడీ విచారణ విషయంలో ఏపీ హైకోర్టు కొన్ని షరతులు విధించింది. దర్యాప్తు అధికారుల విచారణలో పారదర్శకత కోసం ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని, అలాగే విచారణ సమయంలో నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశించింది. దీనికితోడు సీఐ నాగరాజును ఒకరోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో.. మిగిలిన ఏడు రోజులు రాజమండ్రి జైలులోనే విచారించాలని సూచించింది. హైకోర్టు ఆదేశాలపై సిట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో సిఐ నాగరాజు కస్టడీపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సిట్ అధికారులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇప్పటికే 2nd AJMFC కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సిట్ అధికారులు హైకోర్టులో సవాల్ చేయగా.. 2nd AJMFC కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవరించి హైకోర్టు సీఐ నాగరాజును కస్టడీకి అనుమతి ఇచ్చింది. కేసులో వాస్తవాలు వెలికితీసేందుకు విజయవాడలోనే విచారించడానికి అనుమతి ఇవ్వాలని సిట్ అధికారులు కోరుతున్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, సాయికృష్ణ లాకప్డెత్ కేసులో దర్యాప్తు పురోగతి వివరాలతో స్టేటస్ రిపోర్ట్ను
సీల్డ్ కవర్లో తమకు ఇవ్వాలంటూ బుధవారం సిట్ను ఆదేశించింది హైకోర్టు.. ఈ కేసులో తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.