© 2026 nimisham.in
Lakshmi Mittal Ukraine Factory Attack : రష్యా-ఉక్రెయిన్ నడుమ సాగుతున్న యుద్ధం మొదలై నాలుగేళ్లు గడుస్తున్నా.. వారు మాత్రం పోరాటం ఆపడం లేదు. ఏ ఒక్కరూ వెనక్కి తగ్గకుండా.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ దాడులు మరింత ఉద్ధృతమయ్యాయి. ఈ ఘర్షణల క్రమంలోనే భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ లక్ష్మీ మిత్తల్కు చెందిన భారీ స్టీల్ ప్లాంట్పై రష్యా క్షిపణి విరుచుకుపడింది. ఉక్రెయిన్లోని క్రివి రిహ్ నగరంలో ఉన్న ఆర్సెలార్ మిత్తల్ మైనింగ్ అండ్ మెటలర్జికల్ కాంప్లెక్స్ లక్ష్యంగా ఈ దాడి జరిగ్గా... ఈ ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.ఉక్రెయిన్లోనే అత్యంత పెద్ద స్టీల్ తయారీ సంస్థపై దాడిఉక్రెయిన్లోనే అత్యంత పెద్ద స్టీల్ తయారీ సంస్థగా ఉన్న ఆర్సెలార్ మిత్తల్ కాంప్లెక్స్పై జరిగిన ఈ దాడి వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. రష్యా క్షిపణి ధాటికి ఫ్యాక్టరీలోని కీలకమైన కోర్ ఎనర్జీ రంగాలు, బ్లాస్ట్ ఫర్నేస్ విభాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా ప్లాంట్ పరిధిలో ఉక్కు ఉత్పత్తి పాక్షికంగా నిలిచిపోయినట్లు సదరు సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్పై కూడా రష్యా విరుచుకుపడింది. ఈ దాడుల ప్రభావంతో నగరంలోని అత్యంత పెద్ద బుక్ మార్కెట్లో భారీగా మంటలు చెలరేగాయి. పౌర సదుపాయాలే లక్ష్యంగా పుతిన్ సేనలు దాడులకు తెగబడుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తీవ్రంగా మండిపడ్డారు.ఉక్రెయిన్ డ్రోన్ల దాడితో.. రష్యా ప్రతీకార చర్యలుగత కొన్ని రోజులుగా రష్యాలోని సైనిక కర్మాగారాలు, ఇంధన మౌలిక సదుపాయాలను ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకుంటోంది. దీనివల్ల రష్యా ప్రభుత్వం తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. ఆదివారం రష్యా వ్యాప్తంగా ఉక్రెయిన్ వందలాది డ్రోన్లతో దాడికి దిగింది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఉక్రెయిన్ జరిపిన అతిపెద్ద గగనతల దాడుల్లో ఇది కూడా ఒకటి కాగా.. ఈ ఘటనల్లో
ఆరుగురు మరణించారు. అయితే దీనిపై అధికారికంగా స్పందించిన మాస్కో అధికారులు.. రాత్రికి రాత్రే 822 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామని చెప్పారు. కానీ రష్యా అత్యంత సంపన్న మహిళ తత్యానా కిమ్కు చెందిన 'వైల్డ్ బెర్రీస్' ఆన్లైన్ రిటైల్ సంస్థ వేర్హౌస్లు ఉక్రెయిన్ దాడుల్లో మంటల్లో చిక్కుకుని దెబ్బతిన్నాయి.తమ భూభాగంలో ఉక్రెయిన్ జరిపిన ఈ వరుస డ్రోన్ దాడులకు ప్రతీకారంగానే రష్యా బలగాలు ఉక్రెయిన్పై క్షిపణుల వర్షం కురిపించగా.. అందులో లక్ష్మీ మిత్తల్ స్టీల్ ఫ్యాక్టరీ మంటల్లో చిక్కుకుంది. ముఖ్యంగా ఈ దాడిలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే.. సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను సైతం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.