
భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందంటూ ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 'మిరే అసెట్ మేనేజ్ మెంట్ మేనేజర్స్' సీఈవో స్వరూప్ మొహంతి హెచ్చరించారు. పెరుగుతున్న వైద్య ఖర్చులు, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు లేకపోవడం వల్ల దేశంలో 'రిటైర్మెంట్ టైమ్ బాంబ్' పేలే పరిస్థితి కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీవిత చరమాంకంలో సరైన ఆర్థిక భద్రత లేకపోతే మధ్యతరగతి కుటుంబాలు కోలుకోలేని దెబ్బతింటాయని ఆయన పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలు చేసే అతిపెద్ద పొరపాటు తగినంత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడమేనని స్వరూప్ మొహంతి స్పష్టం చేశారు. మారుతున్న కాలంతో పాటు మానవ ఆయుర్దాయం పెరుగుతున్నప్పటికీ, దానికి తగినట్లుగా విశ్రాంతి నిధిని సమకూర్చుకోవడంలో ప్రజలు తీవ్రంగా వెనుకబడుతున్నారని వివరించారు. వయసు పెరిగే కొద్దీ ఆకస్మికంగా వచ్చే వైద్య ఖర్చులు, జీవితకాలం దాచుకున్న పొదుపు మొత్తాన్ని ఒక్కసారిగా కరిగించేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి కేవలం సంప్రదాయ పద్ధతుల్లో పొదుపు చేయడం లేదా షేర్ మార్కెట్లపై మాత్రమే ఆధారపడటం సరిపోదని ఆయన సూచించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవనశైలి ఖర్చులను తట్టుకోవాలంటే చిన్న వయస్సు నుంచే మ్యూచువల్ ఫండ్స్, బంగారం వంటి విభిన్న సాధనాల్లో క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. సరైన ప్లానింగ్ లేకపోతే రిటైర్మెంట్ జీవితం భారంగా మారుతుందని హెచ్చరించారు