
అమెరికాలో హెచ్-1బీ వీసాలపై కొత్తగా 1,00,000 డాలర్ల (సుమారు రూ. 95 లక్షలు) భారీ ఫీజు విధించాలనే ప్రతిపాదనపై భారత సంతతికి చెందిన కాంగ్రెస్మెన్ రాజా కృష్ణమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అమెరికా కంపెనీలు తమ పనులను విదేశాలకు తరలిస్తాయని (ఆఫ్షోరింగ్), తద్వారా దేశం నైపుణ్యం కలిగిన నిపుణులను ఆకర్షించే సామర్థ్యాన్ని కోల్పోతుందని హెచ్చరించారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచ వేదికపై దాని పోటీతత్వానికి తీవ్ర నష్టం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.'స్పిల్ ది టీ' అనే ఇంటర్వ్యూ సిరీస్లో మాట్లాడిన రాజా కృష్ణమూర్తి.. "మీరు ప్రతిభావంతులను దేశంలోకి తీసుకురావచ్చు లేదా పనిని విదేశాలకు తరలించవచ్చు" అని స్పష్టం చేశారు. ఈ భారీ ఫీజుల కారణంగా అమెరికా కంపెనీలు చేతులు ముడుచుకుని కూర్చోవని, పనులను పూర్తి చేయడానికి విదేశీ మార్గాలను అన్వేషిస్తాయని ఇల్లినాయిస్ డెమోక్రాట్ అయిన కృష్ణమూర్తి పేర్కొన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో జారీ అయిన మొత్తం హెచ్-1బీ వీసాలలో 71 శాతం భారతీయులే పొందారని, ఈ నేపథ్యంలో కొత్త ఫీజు విధానం భారతీయులపై, అమెరికా పోటీతత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు.ఈ ఫీజును ఆయన నైపుణ్యం కలిగిన ఉద్యోగులపై వేస్తున్న 'పన్ను'గా అభివర్ణించారు. "అమెరికా ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన సాంకేతిక పాత్రలను పోషించే వారిపై ఇంత పెద్ద మొత్తంలో పన్ను విధించడం సరికాదు. వీరిలో చాలామంది భవిష్యత్తులో కొత్త కంపెనీలు స్థాపించి లక్షలాది ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. ఈ విధానం అలాంటి వారిని దూరం చేస్తుంది"