
1916 జనవరి 4న టర్కీలోని ఇస్తాంబుల్లో ఒట్టోమన్ రాజకుటుంబంలో నీలోఫర్ జన్మించారు. ఆమె తండ్రి సలాహుద్దీన్ బే ఒట్టోమన్ కోర్టులో కీలక స్థానంలో ఉండేవారు. తల్లి ఆదిల్ సుల్తానా.. సుల్తాన్ మురాద్ కుమార్తె. అయితే నీలోఫర్ రాజకుటుంబ జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు. 1918లో ఆమె తండ్రి మరణించారు. ఆ తర్వాత 1924లో టర్కీ రిపబ్లిక్గా మారడంతో ఒట్టోమన్ రాజకుటుంబ సభ్యులను దేశం నుంచి బహిష్కరించారు. అప్పటికి నీలోఫర్ వయసు కేవలం ఎనిమిదేళ్లు. తన తల్లితో కలిసి ఫ్రాన్స్లోని నైస్ నగరానికి వెళ్లిన నీలోఫర్ అక్కడ సాధారణ జీవితాన్ని గడపాల్సి వచ్చింది. రాజకుటుంబంలో పుట్టినా ప్రైవేట్ ట్యూటర్లతో చదువుకునే అవకాశం లేకుండా సాధారణ పాఠశాలలో చదువుకున్నారు.