© 2026 nimisham.in
ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో వరుసగా తొలి రెండు మ్యాచ్లలో ఓడిపోయి సిరీస్ కోల్పోవడంతో పాకిస్థాన్ జట్టు యాజమాన్యం తీవ్ర చర్యలు చేపట్టింది. జట్టులో ఉన్న ఏడుగురు ఆటగాళ్లను తక్షణమే పర్యటన నుంచి తొలగించి స్వదేశానికి తిప్పి పంపింది. ఈ జాబితాలో మాజీ పరిమిత ఓవర్ల సారథి సల్మాన్ అఘా, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్, ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్లతో పాటు ఆమిర్ జమాల్, ఖుర్రం షెహజాద్, అలీ ఉస్మాన్, మహమ్మద్ అవైస్ జఫార్ ఉన్నారు. ఇటీవల ఆడిన ఆరు టెస్టుల్లో ఐదింటిలో ఓడిపోవడం, ఆటగాళ్ల ప్రదర్శన ఘోరంగా ఉండటంతో బోర్డు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.కేవలం ఆటగాళ్లపైనే కాకుండా బౌలింగ్, హెడ్ కోచ్లపై కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంది. ప్రస్తుత టెస్ట్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లను బాధ్యతల నుంచి తొలగించింది. వీరి స్థానంలో పరిమిత ఓవర్ల క్రికెట్ హెడ్ కోచ్గా ఉన్న న్యూజిలాండ్ మాజీ దిగ్గజం మైక్ హెస్సన్కు టెస్ట్ జట్టు బాధ్యతలను కూడా అప్పగించింది. ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్ పూర్తయ్యే వరకు మైక్ హెస్సన్ పాకిస్థాన్ టెస్ట్ జట్టుకు మార్గదర్శకం వహిస్తారు.మూడో టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 9 నుంచి బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభం కానుంది. దీనికోసం సామ్ ఆయుబ్, అబ్దుల్లా ఫజాల్లను జట్టులోకి తీసుకున్నారు. వారితో పాటు అరాఫత్ మిన్హాస్, మహమ్మద్ ఇమ్రాన్ జూనియర్, సాద్ బైగ్, రాజావుల్లా, మహమ్మద్ ఇమ్రాన్లను నూతనంగా జట్టులోకి ఎంపిక చేశారు. వీరికి వీసాలు లభించిన వెంటనే ఇంగ్లాండ్లోని జట్టుతో కలవనున్నారు.ఇప్పటికే సిరీస్ కోల్పోవడంతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు నుంచి కూడా పాకిస్థాన్ నిష్క్రమించింది. ఈ క్రమంలో బర్మింగ్హామ్లో జరిగే చివరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవడంతోపాటు వైట్ వాష్ పరాభవాన్ని తప్పించుకోవాలని పాకిస్థాన్ భావిస్తోంది. చివరి టెస్టులో బాబర్ ఆజామ్ సారథ్యంలో యువ ఆటగాళ్లతో బరిలోకి
దిగుతున్న పాకిస్థాన్ జట్టు, ఈ మార్పులతోనైనా విజయాన్ని సాధిస్తుందో లేదో వేచి చూడాలి.