
బుచ్చిరెడ్డిపాలెం: పేదల సంక్షేమానికి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు గ్రామంలో మంగళవారం ఇంటింటికీ తిరిగి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 62 లక్షల మందికి ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నామన్నారు. ఇచ్చిన హామీ మేరకు ‘సూపర్ సిక్స్’ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. గత రెండేళ్లలో పంచేడు పంచాయతీ పరిధిలో రూ.4.44 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్, 108 ఇళ్లకు సోలార్ కనెక్షన్లు కల్పించడంతో పాటు పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, నుడా నిధులతో రూ.7.98 కోట్ల విలువైన సీసీ రోడ్లు, డ్రెయిన్లు, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు వివరించారు. అర్హులైన పేదలకు సొంతింటి స్థలాలను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంచేడు-బుచ్చిరెడ్డిపాలెం రహదారి నిర్మాణానికి రూ. కోటి మంజూరైందని, త్వరలోనే పనులు ప్రారంభించి మిగిలిన సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు